
ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న రైతులు, అశేష జనసందోహంలో ఓ భాగం , పొదిలి పొగాకు వేలం కేంద్రంలో రైతులతో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
రాష్ట్రంలో తిరోగమనంలో వ్యవసాయ రంగం.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు
తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలి
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్
వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దింపాలి.. పొగాకుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి
లేదంటే ఆందోళన ఉధృతం చేస్తాం
తీవ్ర కష్టాల్లో రైతాంగం.. అయినా పట్టని ప్రభుత్వం.. దిక్కుతోచని స్థితిలో రైతుల ఆత్మహత్యలు
ప్రకాశం జిల్లాలో ఇటీవలే ఇద్దరు బలవన్మరణం
ఇన్పుట్ సబ్సిడీ లేదు.. ఉచిత పంటల బీమాకు మంగళం
తొలి ఏడాది రైతు భరోసా పెట్టుబడి సాయానికి ఎగనామం
రెండో ఏడాది కేంద్రం ఇచ్చినా.. రాష్ట్ర వాటా ఊసే లేదు
ఆర్బీకేలు సహా అన్ని వ్యవస్థలూ పూర్తిగా నిర్వీర్యం
గత ఏడాది పొగాకు కేజీ ధర రూ.366. ఈ ఏడాది అది పెరగాల్సింది పోయి కనీసం రూ.200 కూడా సగటు ధర దక్కడం లేదు. ఖర్మకాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రేటు దారుణంగా పడి పోయింది. మొన్న మిర్చి పంట సమయంలోనూ చంద్రబాబు ఇదే డ్రామా చేశారు. క్వింటా రూ.11,781తో కొంటామన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబును అడుగుతున్నా.. ఎన్ని కేజీలు కొన్నారు? ఎంత మంది రైతుల నుంచి మిర్చి కొన్నారు? లెక్కలు చెప్పండి. నిజం ఏమిటంటే, చంద్రబాబు ప్రభుత్వం మిర్చి ఒక్క క్వింటా కూడా కొనలేదు.
– వైఎస్ జగన్మోహన్రెడ్డి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో వ్యవసాయ రంగం తిరోగమనంలో కొనసాగుతోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం రైతులకు శాపంగా పరిణమించిందన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగి పోయాయని, ఇటీవల ఒక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే పర్చూరులో ఒకరు, కొండపిలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే పొగాకు రైతులను ఆదుకోవాలని, వారికి గిట్టుబాటు ధర వచ్చేలా, మార్క్ఫెడ్ను వెంటనే రంగంలోకి దింపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బుధవారం ఆయన ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డును సందర్శించారు. అక్కడ అధికారులు, రైతులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా, రైతులకు కనీస మద్దతు ధర కంటే రూ.300 తక్కువ చెల్లించిందని చెప్పారు.
వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, పెసలు, రాగులు, మొక్కజొన్న, కోకో, వేరుశనగ, చీనీ, పొగాకు ఇలా.. ఏ పంట తీసుకున్నా రైతన్నకు రాష్ట్రంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోందన్నారు. అదే ఏడాది క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగిందని గుర్తు చేశారు. ఒక్క ఏడాదిలోనే అది పూర్తిగా దిగజారిందని చెప్పడానికి జిల్లాలో జరిగిన రైతుల ఆత్మహత్యలే నిదర్శనం అని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
రైతు భరోసా లేదు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఇచ్చిన పెట్టుబడి సాయం చంద్రబాబు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఈ పెద్దమనిషి చంద్రబాబు, మోదీ ఇచ్చే రూ.6 వేలు కాకుండా, మరో రూ.20 వేలు ఇస్తానని చెప్పి, గత ఏడాది మొత్తం ఎగరగొట్టాడు. ఈ ఏడాది మోదీ ఇవ్వాల్సిన రూ.6 వేలు ఇచ్చేసినా, చంద్రబాబు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టారు. అంత దుర్భర పరిస్థితుల మధ్య రాష్ట్రంలో వ్యవసాయం సాగుతోంది.
ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీకి మంగళం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసే నాటికి ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చే సంప్రదాయం ఉండేది. ఈ రోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేశారు. రైతులు ఎలా నష్టపోయినా, ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట వేసిన తర్వాత, పంట నష్టపోతామన్న భయం రైతులకు లేకుండా, ప్రతి పంటకు ఉచిత పంటల బీమా అమలు చేశాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేసి, ఆర్బీకేల ద్వారా ఉచిత పంటల బీమా అమలు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది.
వ్యవసాయంలో అన్నీ నీరుగార్చారు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా అమలు చేసిన పంటల ఈ–క్రాప్ వ్యవస్థను, దళారులు లేకుండా పంటలు కొనుగోలు చేసే ఆర్బీకే వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం నీరుగార్చింది. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నాణ్యతను పరిశీలించి, వాటి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ, రాష్ట్రంలోని 146 రూరల్ నియోజకవర్గాల్లో గత ప్రభుత్వం ల్యాబ్లు ఏర్పాటు చేసింది.
ఆర్బీకేల ద్వారా రైతులకు గ్రామంలోనే అవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేసి, మళ్లీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులకు అవకాశం కల్పించింది. మా ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా, ఆర్బీకే వ్యవస్థ ద్వారా దళారీలకు తావు లేకుండా చేసి, రైతులకు కనీస మద్దతు ధర అందించాం.
జీఎల్టీ (గన్నీ బ్యాగులు, లేబర్, రవాణా చార్జీలు) కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చాం. అదే ఈ రోజు రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ధాన్యాన్ని రూ.300 తక్కువకు కొనుగోలు చేశారు. రైతు దళారీలకు అమ్ముకున్నాడు. అదే మా ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, మార్కెట్లో పోటీ తత్వాన్ని తెచ్చి, రైతులను ఆదుకున్నాం.
కేంద్రం ప్రకటించని వాటికీ ఎమ్మెస్పీ
కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి, టమాటా వంటి పంటలకు కూడా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించాం. ఆర్బీకేలలో వాటిపై పోస్టర్లు ఏర్పాటు చేసి అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ను కూర్చోబెట్టి.. ప్రతి పంట ఈ–క్రాప్ చేసి.. ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకపోతే.. అక్కడ సీఎం యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా వెంటనే ఆ పంటకు సంబంధించిన రేట్లు అప్డేట్ చేయించాం. ఆ వెంటనే ప్రభుత్వం కూడా స్పందించేది. ఆ మేరకు మార్కెటింగ్ శాఖ రంగ ప్రవేశం చేసి, ఎమ్మెస్పీకి పంటలు కొనుగోలు చేసేది. ఈ రోజు అవన్నీ గాలికెగిరిపోయిన పరిస్థితుల్లో వ్యవసాయం నడుస్తోంది.
పొగాకుకు మద్దతు ధర
పొగాకు పంటనే తీసుకుంటే.. మా ప్రభుత్వం చివరి సంవత్సరం (2023–24)లో కూడా కేజీ రూ.360 చొప్పున క్వింటా రూ.36 వేలకు వర్జీనియా పొగాకు అమ్ముడుపోయింది. లోగ్రేడ్ పొగాకు కూడా క్వింటా రూ.24 వేలకు తగ్గకుండా అమ్ముడుపోయింది. కానీ, ఈరోజు పరిస్థితి ఏమిటనేది మనమే వెళ్లి చూశాం. ఈరోజు జగన్ వస్తున్నాడని.. ఏం మాట్లాడుతాడోనని.. అల్లరవుతామేమేనని వీరంతా సిండికేట్ అయ్యి కాస్తో.. కూస్తో కొంత రేట్లు పెంచే ప్రయత్నం చేశారు.
కేవలం 40 మిలియన్ టన్నులు
మామూలుగా ఈ ప్రొక్యూర్మెంట్ మార్చిలో మొదలుపెట్టి జూన్ నాటికి పూర్తి చేయాలి. ఆ మేరకు ఈ ఏడాది 220 మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే చేశారు. అలాగే ఈరోజు రేటెంత అని చూస్తే హైగ్రేడ్ బ్రైట్ క్వాలిటీ రేటు సగటున కేవలం కిలో రూ.220 నుంచి రూ.260 మధ్య అమ్ముడుపోతోంది. హైగ్రేడ్ క్వాలిటీ రూ.240కి కూడా రావడం లేదు. ఈరోజు నేను వచ్చాను కాబట్టి రూ.280కి కొంటున్నారు.
ఇంక లోగ్రేడ్ చూస్తే కొనే నాథుడే లేడు. దాన్ని రూ.160 నుంచి రూ.180కి కొంటున్నారు. ఆ ధర నచ్చక రైతులు నలభై శాతం స్టాక్ వెనక్కు తీసుకెళ్తున్నారు. అదే మా ప్రభుత్వ హయాంలో ఇదే హైగ్రేడ్ క్వాలిటీ కేజీ రూ.366కు అమ్ముడు పోయింది. అంటే క్వింటా రూ.36 వేలకు పైగా కొన్నారు. ఇప్పుడు జూన్ నెల మధ్యకొచ్చాం. సీజన్ అయిపోతున్నా 220 మిలియన్ టన్నులు కొనాల్సి ఉంటే, కొనుగోలు చేసింది కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే.
పక్కనే ఉన్న కర్ణాటకలో కేజీ రూ.360కి కొనుగోలు చేస్తే మన రాష్ట్రంలో రైతులకు కనీసం యావరేజ్ రేటు రూ.200 కూడా దక్కడం లేదంటే, వారు ఎంత దయనీయ పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్లాక్ బర్లీ పొగాకు గత ఏడాది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు అమ్ముడుపోతే, ఈరోజు ఆ ధర రూ.6 వేల నుంచి రూ.9 వేలు దాటడం లేదు. దీంతో పొగాకు రైతు ఎకరాకు రూ.80 వేలు నష్టపోతున్న దుస్థితి కనిపిస్తోంది.
నాడు పొగాకు రైతుకు స్వర్ణయుగం
2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా 2020లో పొగాకు వేలం (ఆక్షన్) ప్రక్రియలోకి మార్క్ఫెడ్ను రంగంలోకి దింపింది. అలా మార్కెట్లో పోటీ పెంచి, ఏకంగా రూ.140 కోట్లు ఖర్చు చేసి కార్టల్ను బ్రేక్ చేసి రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా చూశాం. అదే ఈ రోజు రైతు సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలు ఇప్పించాలన్న తపన, తాపత్రయం ఎక్కడా లేదు కాబట్టే రైతులు తీవ్రంగా నష్టపోతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది.
రూ.4 లక్షల పరిహారం ఘనత మాదే
పొగాకు, ఇతర పంటలకే కాకుండా, మిర్చి రైతుకు కూడా రూ.4 లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాదే. ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి, గిద్దలూరు, మార్కాపురంలో రైతు ఏనాడూ భయపడేవాడు కాదు. ఏ పంట వేసినా.. వరదలొచ్చినా, తుపాన్ వచ్చినా, కరువొచ్చినా.. ఇన్సూరెన్స్ కట్టామా లేదా అనే దిగులు రైతుకు ఉండేది కాదు. వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత పంటల బీమా డబ్బులు కట్టేది.
పంట వేసిన ప్రతి ఎకరా కూడా ఆటోమేటిక్గా ఈ–క్రాప్ జరిగేది. ఉచిత పంటల బీమా కింద 54.55 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.7,800 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించి ఏ రైతు నష్టపోకుండా రైతన్నకు తోడుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలబడింది. మిర్చి పంటకు ఎకరాకు రూ.80 వేల చొప్పున, పప్పు ధాన్యాలకు ఎకరాకు రూ.6 వేల చొప్పున నష్టపరిహారం ఇప్పించాం. అలా ఐదు ఎకరాలున్న మిర్చి రైతుకు ఏకంగా రూ.4 లక్షల పరిహారం ఇచ్చాం.
రైతులను మోసం చేశారు
చంద్రబాబు సీఎం అయ్యాక రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయం దండగ అనే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. ‘ఈ సంవత్సరం 20 శాతం పొగాకు ఎక్కువగా పండించండి.. మేము కొనుగోలు చేస్తాం’ అని పొగాకు బోర్డు హామీ ఇచ్చింది. గతేడాది బ్యారన్కి 35 క్వింటాళ్లకు పర్మిషన్ ఇస్తే ఈసారి 42.5 క్వింటాళ్లకు పర్మిషన్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతోనే రైతులు సాగు విస్తీర్ణం పెంచారు.
పంటను కొంటామని హామీ ఇవ్వడంతో సాగు విస్తీర్ణం 30 శాతం పెరిగింది. ఒకవైపు రైతుకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. మరోవైపు వాతావరణం సహకరించక దిగుబడి తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పొగాకు రేటు పెంచాలి. కానీ రైతు ఖర్మకాలి చంద్రబాబు సీఎం అయ్యాడు. ఆ దెబ్బకు రేటు దారుణంగా పడి పోయింది. గత ఏడాది కేజీ ధర రూ.366 కాగా, అది పెరగాల్సింది పోయి, కనీసం రూ.200 కూడా సగటు ధర దక్కడం లేదు.
ఇతర పంటలదీ అదే దుస్థితి
నిన్న (మంగళవారం)నే మా ఆఫీస్కు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వచ్చి కోకో పంట గురించి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కోకో కిలో గింజల ధర రూ.1,050 ఉండేది. ఇప్పుడు రూ.370, రూ.360 మాత్రమే అని రైతులు చెప్పారు. అలాగే పామాయిల్ ధర గత ప్రభుత్వ హయాంలో గరిష్టంగా రూ.23,360, కెర్నిల్ నట్స్కు రూ.29,360 ధర ఉంటే.. ఇప్పుడు రూ.18,606కి పడిపోయింది.
ఈ ప్రభుత్వం ఇకనైనా రైతుల సమస్యలపై స్పందించాలి. వెంటనే పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టాలి. ఆ దిశలో మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి, పోటీతత్వం పెంచి ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే కచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం.
ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుదాం
పొగాకు రైతులకు వైఎస్ జగన్ భరోసా
అన్నదాతలు, అధికారులతో ముఖాముఖి
పొదిలి/కొనకనమిట్ల: పొగాకు రైతులు అధైర్య పడొద్దని, ధరలు పెంచి కొనుగోలు చేసే వరకు పోరుబాటలో ఉంటామని.. ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుదామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. పంట ఉత్పత్తి, ధరలు, రైతుల పరిస్థితిపై తొలుత వేలం అధికారులతో మాట్లాడారు.
వేలం అధికారి గిరిరాజ్కుమార్ పొదిలి వేలం కేంద్రం పరిధిలోని వివరాలను వైఎస్ జగన్కు వివరించారు. ‘4,390 మంది రైతులు 2,601 బ్యారన్ల కింద పొగాకు సాగు చేస్తున్నారు. 8,534 హెక్టార్లలో పొగాకు సాగు చేపట్టాల్సి ఉండగా, 11,031 హెక్టార్లలో సాగు చేశారు. 11.10 మిలియన్ కిలోల అమ్మకాలకు బోర్డు అనుమతి ఇవ్వగా, 18 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరిగిందని అంచనా వేస్తున్నాం.
బ్రైట్ రకం కిలో రూ.265, మీడియం రూ.225, లో గ్రేడ్ రూ.180 సగటు ధరగా కొనుగోలు చేస్తున్నాం. బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లోనూ 25% ఉత్పత్తి పెరిగింది. బయ్యర్లు లోగ్రేడ్ రకం పొగాకును కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవటంతో రిజక్షన్ బేళ్ల సంఖ్య అధికంగా ఉంది’ అని తెలిపారు. ‘లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతుల వద్ద పొగాకు అధికంగా నిల్వ ఉంది. సగటు ధర పూర్తిగా తగ్గిపోయింది. రిజక్షన్ బేళ్ల సంఖ్య పెరిగింది. అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అంటూ రైతులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రైతులు ధైర్యం వీడొద్దని, రైతుల పట్ల వ్యతిరేక విధానాలతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు, రైతులకు మేలు జరిగేలా మార్క్ఫెడ్ను రంగంలోకి దించేంత వరకు పోరుబాటతో రైతులకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. జగన్ పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వస్తున్నారని కూటమి ప్రభుత్వ పెద్దలు, పొగాకు బోర్డు అధికారులు రైతులను బలవంతంగా బయటకు పంపించారు. రైతులు లేకుండానే ఏకపక్షంగా ధర నిర్ణయించేశారు. జగన్ వస్తున్నారని బుధవారం తిరస్కరణ శాతాన్ని తగ్గించడం గమనార్హం.