వివేకా భార్య సౌభాగ్యమ్మకు వైఎస్‌ భాస్కరరెడ్డి సతీమణి బహిరంగ లేఖ | Ys Bhaskar Reddy Wife Open Letter To Viveka Wife Sowbhagyamma | Sakshi
Sakshi News home page

వివేకా భార్య సౌభాగ్యమ్మకు వైఎస్‌ భాస్కరరెడ్డి సతీమణి బహిరంగ లేఖ

Apr 26 2024 9:18 PM | Updated on Apr 26 2024 9:18 PM

Ys Bhaskar Reddy Wife Open Letter To Viveka Wife Sowbhagyamma

వివేకా భార్య సౌభాగ్యమ్మకు వైఎస్‌ భాస్కరరెడ్డి సతీమణి లేఖ

జగన్‌ వేదన ఇప్పుడు గుర్తుకొచ్చిందా!

విజయమ్మ మీద పోటీ చేయించిన రోజు వారి మనోవేదన గుర్తులేదా?

సంబంధంలేని వారిని టార్గెట్‌ చేసి ఇరికించడం నీకు తప్పనిపించడంలేదా?

జగన్‌ను ఒంటరిని చేసి మీ స్వార్థం మీరు చూసుకోలేదా?

సంబంధంలేని వారిని వివేకా కేసులో ఇరికించడం తప్పనిపించడంలేదా?

ఆయన హత్యకు కారకులైన వారు మీతోనే.. మీలోనే ఉన్నారు

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్‌ భాస్కరరెడ్డి సతీ­మణి వైఎస్‌ లక్ష్మీ గురువారం ఒక బహి­రంగ లేఖ విడుదల చేశారు. దీనిని వివేకా భార్య సౌభాగ్యమ్మకు రాశారు లక్ష్మీ. ‘2009లో తండ్రిని కోల్పోయినప్పుడు జగన్‌ ఎంతో మనోవేదన అనుభవించాడని ఇప్పుడు గుర్తొస్తోందా? 2010లో కాంగ్రెస్‌ ప్రభుత్వం జగన్‌ను చిన్నచూపు చూసినపుడు జగన్‌కు అండగా నిలచి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరందరూ కలిసి ఒంటరివాడిని చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నపుడు జగన్‌ మనోవేదన గుర్తుకురాలేదా’.. అన్నారు వైఎస్‌ లక్ష్మీ.

2011లో నీ భర్తను నువ్వు, నీ కుమార్తె, అల్లుడు విజ­యమ్మపై పోటీచేయించినప్పుడు వాళ్ల మనోవేదన ఎలా ఉందో మీకు తెలీదా? నీ కుమార్తె, అల్లుడు పూలంగళ్ల వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారెంత మనోవేదన అను­భవించారో కూడా తెలీదా? వివేకానందరెడ్డి వైఎస్‌ జగన్‌ను సీఎంగా చూడా­లని కోరుకున్న మాట ఎంతో వాస్తవమో, 2019 మార్చి 14 రాత్రి కూడా అవినాష్‌ను ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా అంతే వాస్తవం. ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీతే మీడియాకు వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ మీరే అదే ఎంపీ టికెట్‌ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం.. సంబంధంలేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పనిపించడంలేదా?

ఎవరిని కాపాడుకునేందుకు మీరిలా చేస్తున్నారు? మీ కుమార్తె న్యాయం కోసం పోరాటం చేస్తుంటే జగన్‌ సంపూర్ణ మద్దతు తప్పక ఉంటుంది. అలా కాకుండా.. మీ కుమార్తె వైఎస్సార్, జగన్‌ శత్రువులతో చేతులు కలిపి, వారి చేతిలో పావుగా మారి సంబంధంలేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తే జగన్‌ మీకెలా  మద్దతివ్వగలడు? హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు.. మీలోనే ఉన్నారు. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ. ఇక మాటిమాటికి హంతకులని మీరు మాట్లా­డుతున్నారు.. పైగా చాలా తీవ్రమైన పదజాలంతో అవి­నాష్‌ను తిడుతున్నారు.

"న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతట మీరే హంతకుడని ఎలా మాట్లాడగలరు? అలా మాట్లా­డటం మీకు తప్పనిపించడంలేదా? నీ కుమార్తెను, షర్మిలమ్మను ఎవరు టార్గెట్‌ చేయలేదు. వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం. ఇప్పటికైనా వైఎస్సార్, జగన్‌ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలు, కుతంత్రాల నుంచి బయటకొచ్చి చేసిన తప్పు తెలుసుకుని నిజమైన న్యాయ పోరా­టం చేయండి. అన్యాయంగా మీవల్ల బాధపడుతున్న వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థంచేసుకునే ప్రయత్నం చేయండి. నిజం ఎంత లోతులో దాచినా దాగదు.. తప్పకుండా బయటపడుతుంది" అని లేఖలో పేర్కొన్నారు లక్ష్మీ.

Advertisement
 
Advertisement
Advertisement