సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హీరో,తమిళగ వెట్రి కగజం (టీవీకే)అధినేత విజయ్ పోటీ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. విజయ్ పోటీ చేయనున్న నియోజకవర్గంపై టీవీకే ప్రతినిధులు పరోక్షంగా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో టీవీకేతో పాటు ఇతర రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. తాజాగా, చెన్నైలో టీవీకే కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు.. టీవీకే ఎన్నికల క్యాంపెయిన్ మేనేజ్మెంట్ సెక్రటరీ ఆధవ్ అర్జునకి విజ్ఞప్తి చేశారు. కార్యకర్తల విజ్ఞప్తిని పార్టీ అధినేత విజయ్కు వివరిస్తామని అన్నారు.
అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ మాట్లాడుతూ..‘మీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం. మీ తీర్మానాన్ని ‘దళపతి’కి చేరవేరుస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆధవ్ అర్జున మాట్లాడుతూ.. పార్టీ నాయకత్వం పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలని నమ్ముతుందని, ఉత్తర చెన్నై ప్రాంతం ఆ పరిస్థితులను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. పెరంబూర్ నియోజకవర్గం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, సామాజిక సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా టీవీకే గుర్తించింది.
అందుకు అనుగుణంగా పెరంబూర్,కోల్తాపూర్,ఆర్కే నగర్ ఈ మూడు అసెంబ్లీ స్థానాల్లో ఏదైనా ఒక స్థానం పోటీ చేసే అంశంపై విజయ్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


