TPCC Revanth Reddy's Interesting Comments On KCR Family - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ Vs బీఆర్‌ఎస్‌.. రేవంత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Jul 12 2023 4:15 PM | Updated on Jul 12 2023 4:19 PM

TPCC Revanth Reddy Political Interesting Comments Over KCR Family - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటకలో విజయం సాధించడంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ఈ క్రమంలో కేసీఆర్‌ టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేతలు దూకుడు పెంచారు. ఇక, తాజాగా తెలంగాణలో ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 

కాగా, రేవంత్‌ ట్విట్టర్‌ వేదికగా కేసీఆర్‌ సర్కార్‌, ఫ్యామిలీని టార్గెట్‌ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లో ‘‍కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా.. మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే.. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే’ అని తెలిపారు. 

వ్యవసాయానికి 24 గంటల కరెంట్..
ఇక, అంతకుముందు కూడా రేవంత్‌ తెలంగాణలో ఉచిత కరెంట్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. ‘తెలంగాణలో 95% రైతులు మూడెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు. ఒక ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు మూడు గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉంటే చాలు. టోటల్‌గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే స్లోగన్ తీసుకొచ్చిండు. ఉచిత కరెంట్ పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతుండు. ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు. దాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని చెప్పేసి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా చెబుతున్నం’ అని అన్నారు. దీంతో, రేవంత్‌ కామెంట్స్‌ పొలిటికల్‌ హీట్‌ను పెంచాయి. 

కాంగ్రెస్‌కు కవిత కౌంటర్‌..
మరోవైపు.. రేవంత్‌ కామెంట్స్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌ ఇచ్చారు. రైతుకు వ్యవసాయం మంచిగా ఉండాలంటే నీళ్లు, కరెంటు ఉండాలి. కేసీఆర్ పెట్టిన రైతుబంధు పధకాన్ని ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఓ బోగస్. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే తప్పు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తే తమకు కళ్ళ మంట ఎందుకంటూ ఫైరయ్యారు. కాంగ్రెస్ పాలనలో అర్ధరాత్రి కరెంటు వస్తే అనేక మంది రైతులు చనిపోలేదా అంటూ ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: ‘నాకు తెలంగాణ సీఎం కావాలనే ఆశ లేదు’

Advertisement
 
Advertisement
Advertisement