మన ప్రత్యర్థి బీఆరెస్సా.. బీజేపీనా? | Telangana State Congress in-charge Meenakshi questions MLAs | Sakshi
Sakshi News home page

మన ప్రత్యర్థి బీఆరెస్సా.. బీజేపీనా?

May 29 2025 6:13 AM | Updated on May 29 2025 6:13 AM

Telangana State Congress in-charge Meenakshi questions MLAs

సంక్షేమ పథకాల ప్రచారం ఎలా ఉంది? 

ప్రజలేమంటున్నారు? కార్యకర్తల మూడ్‌ ఏంటి? 

ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి ప్రశ్నలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్‌ పార్టీలో తాజా పరిణామాలు ఏంటి? అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులను రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ ఆరా తీశారు. బుధవారం ఆమె ఏడు పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన నేతలతో ముఖాముఖి సమావేశమయ్యారు. 

హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులతో విడివిడిగా సమావేశమయ్యారు. ‘క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితేంటి? కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా జరుగుతోంది? ప్రభుత్వం గురించి ప్రజలేమనుకుంటున్నారు? పార్టీ పదవులు ఇచ్చేందుకు పరిగణనలోకి తీసువాల్సిన ప్రాతిపదిక ఏంటి? తెలంగాణలో అసలైన రాజకీయ ప్రత్యర్థిగా బీఆర్‌ఎస్‌ను పరిగణించాలా? బీజేపీని తీసుకోవాలా? ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి కారణాలేంటి? ఆదిలాబాద్‌ జిల్లాల్లో పార్టీ పూర్తిగా వెనుకబడటానికి కారణమేంటి? అని నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల జవాబులను ఆమె నోట్‌ చేసుకున్నారని, ఈ సమాచారాన్ని క్రోడీకరించి అధిష్టానానికి నివేదిక అందజేస్తారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి.  

ప్రభుత్వంతో సమన్వయం ఉండాలి 
ఒక్కో నేతకు 10 నిమిషాల సమయం ఇచ్చిన మీనాక్షి.. పలు అంశాలపై సమాచారం రాబట్టారు. సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్‌ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలు ప్రభుత్వానికి ప్రజల్లో మైలేజీ తెస్తున్నాయని కొందరు ఎమ్మెల్యేలు చెప్పగా.. మరికొందరు పలువురు మంత్రుల వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. 

ఆపరేషన్‌ సిందూర్‌ను అకస్మాత్తుగా విరమించుకోవటంతో బీజేపీ, ప్రధాని మోదీ గ్రాఫ్‌ పూర్తిగా పడిపోయిందని, బీఆర్‌ఎస్‌లో కుటుంబ కలహాలతో కేడర్‌ నిస్తేజంగా మారిందని కొందరు నేతలు తెలిపారు. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే సానుకూల ఫలితాలు వస్తాయని సూచించినట్లు సమాచారం. నేతల మధ్య సమన్వయ లేమితోనే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినట్లు కొందరు తెలిపారు. 

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌లు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినట్టు సమాచారం. సరస్వతి పుష్కరాల సందర్భంగా అధికారులు ప్రొటోకాల్‌ పాటించలేదని పెద్దపల్లి ఎంపీ వంశీ, ఆయన తండ్రి వివేక్‌ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఉండాలని.. అందరూ సర్దుకుపోయి పనిచేయాలని మీనాక్షి నేతలకు సూచించినట్లు సమాచారం. గురువారం మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో మీనాక్షి నటరాజన్‌ సమావేశమవుతారని గాం«దీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.  

పార్టీ బలోపేతం గురించి అడిగారు: రేఖా నాయక్‌ 
మీనాక్షితో భేటీ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు. ఖానాపూర్‌ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్‌ మాట్లాడుతూ.. పార్టీని భవిష్యత్తులో ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై మీనాక్షి మాట్లాడారని చెప్పారు. ఇందుకు గల వ్యూహం గురించి, భవిష్యత్తు సవాళ్లను ఎలా అధిగమిస్తారనే విషయాల గురించి మాట్లాడారని వివరించారు. డీసీసీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పినట్లు తెలిపారు.  

నేను చెప్పాల్సింది చెప్పా 
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్‌కు తాను చెప్పదల్చుకున్న విషయాలన్నింటినీ చెప్పానన్నారు. తనకు మీడియాలో కనిపించాలన్న తాపత్రయం లేదన్న ఆయన.. అన్ని విషయాలను ఇన్‌చార్జికి వివరించినట్లు వెల్లడించారు. తాను కూడా మంత్రిపదవికి అర్హుడనేనని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. చాలా రోజుల క్రితమే తన మనసులో మాటను సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పానని, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని కూడా అడిగానని వెల్లడించారు.  

మీనాక్షి ఓ డాక్టర్‌ 
మీనాక్షి నటరాజన్‌ డాక్టర్‌ పని చేస్తున్నారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో కలిసి ఆమె తగిన ట్రీట్‌మెంట్‌ కూడా ఇస్తారని, పారీ్టలో అన్నీ సెట్‌ చేస్తారని చెప్పారు. తన నియోజకవర్గ సమస్యలేవైనా ఉంటే లేఖ రూపంలో ఇవ్వాలని మీనాక్షి అడిగారని వెల్లడించారు. కార్యకర్తలపై ఫోకస్‌ పెట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement