
కోల్కతా:పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే మమత అరెస్టు తప్పదన్నారు. సందేశ్ఖాలీలో మహిళలను టీఎంసీ నేతలు వేధించిన ఘటనలకు మమత బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పారు.
‘2026లో బెంగాల్లో బీజేపీ పవర్లోకి వస్తే సందేశ్ఖాలీ ఘటనలపై విచారణ కమిషన్ వేస్తాం. సీఎం మమత కూడా జైలుకు వెళ్లకతప్పదు. సందేశ్ఖాలీలో మన తల్లులు, అక్కచెల్లెలను తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు.
దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదు’అని సువేందు అధికారి హెచ్చరించారు. మమతా బెనర్జీ సందేశ్ఖాలీలో పర్యటించిన మరుసటి రోజే పోటీగా అక్కడ నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సువేందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా,గతేడాది ప్రారంభంలో తృణమూల్ నేత షాజహాన్షేక్ తమ భూములు కబ్జా చేయడమే కాకుండా తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఉత్తరపరగణాల జిల్లా సందేశ్ఖాలీలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అనంతరం షేక్షాజహాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.