Sridhar Babu And Jeevan Reddy In The Satyagraha Deeksha Meeting At Gandhi Bhavan, Details Inside - Sakshi
Sakshi News home page

Satyagraha Deeksha Meeting: దేశం రాహుల్‌ వెంటే..

Jul 13 2023 3:06 AM | Updated on Jul 13 2023 9:36 AM

Sridhar Babu and Jeevan Reddy in the Satyagraha Deeksha meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విచ్ఛిన్నకర శక్తులకు ఎదురొడ్డి దేశ ఐక్యత కోసం పాటుపడుతున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వెంటే దేశం నిలుస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టి.జీవన్‌రెడ్డి చెప్పారు. భారత్‌జోడో యాత్ర పేరు తో దేశవ్యాప్తంగా తిరిగి ప్రజలను చైతన్యపరుస్తున్న రాహుల్‌ అంటే బీజేపీ బెంబేలెత్తుతోందని, అందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిప డ్డారు.

రాహుల్‌పై బీజేపీ అణచివేతకు నిరసనగా బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ‘సత్యాగ్రహ మౌన దీక్ష’ జరిగింది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగి న దీక్ష అనంతరం నిర్వహించిన సభలో శ్రీధర్‌బా బు, జీవన్‌రెడ్డి మాట్లాడారు. రాహుల్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే దేశప్రజలు ఊరుకోరని, ఆ యనకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కాంగ్రెస్‌ కార్యక ర్తలు పోరాటాలకు దిగుతారని హెచ్చరించారు. 

దేశంలోని ఆర్థిక నేరగాళ్లను దృష్టిలో పెట్టుకుని నాలుగేళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టులకెక్కి, శిక్షలు వేయించి, ఉద్దేశపూర్వకంగా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయించారని విమర్శించారు. గత ప్రభుత్వంలో కూడా గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నారనే సాకుతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసన సభ్యత్వాలను కేసీఆర్‌ రద్దు చేయించారన్నారు.

ఇప్పుడు మోదీ కూడా కేసీఆర్‌ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని ధ్వజమెత్తారు. తాము సత్యాగ్రహ దీక్ష చేస్తున్నామన్న దుగ్ధతో ఆ దీక్షను భగ్నం చేసేందుకు ఉచిత విద్యుత్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ డ్రామాలు ఆడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ గందరగోళానికి గురిచేస్తోందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు.  

బీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించాలి: మన్సూర్‌ అలీఖాన్‌
విద్వేషాన్ని అడ్డుకుని దేశాన్ని రక్షించేందుకు రాహుల్, సోనియా, ఖర్గే పోరాడుతున్నారని ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి మన్సూర్‌ అలీఖాన్‌ చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇస్తోందని, బీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించేందుకు అందరూ రాహుల్‌కు అండగా నిలవాలని కోరారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ మాట్లాడుతూ ఒకే నేరంపై వివిధ రాష్ట్రాల్లో కేసులు వేయడం, వాటిని కోర్టులు సమర్థించడం బాధ కలిగిస్తోందన్నారు.

మౌనదీక్ష రాహుల్‌ కోసమే కాదని, దేశంలోని ప్రతి వ్యక్తి స్వేచ్ఛ కోసమని వ్యాఖ్యానించారు. రాహుల్‌ ఎంపీగా ఉంటే ప్రధాని అవుతాడనే భయం మోదీకి పట్టుకుందని ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్‌ లోక్‌సభలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయించారన్నారు.

ఈ దీక్షలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మల్లురవి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఏపీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌తోపాటు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement