TG: పాలనపైనే దృష్టి | Rythu Welfare Corporation for Farmer Loan Waiver | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పాలనపైనే దృష్టి

May 15 2024 5:56 AM | Updated on May 15 2024 7:15 AM

Rythu Welfare Corporation for Farmer Loan Waiver

నేటి నుంచి సచివాలయానికి వెళ్తా.. ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి పనిచేస్తా

విలేకరులతో సీఎం రేవంత్‌ ఇష్టాగోష్టి.. లోక్‌సభ ఎన్నికల్లో 13 సీట్లు గెలుస్తామని అంచనా

భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌ నిలబడుతుందో లేదో చూడాలి.. ఈ ఎన్నికల్లో మోదీ గాలి లేదు..

కేంద్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు

రైతు రుణమాఫీ కోసం రైతు సంక్షేమ కార్పొరేషన్‌

రేషన్‌షాపుల్లో పేదలకు అవసరమైన వస్తువులు ఇచ్చే ఆలోచన

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో ఎన్నికలు ముగి శాయి. రాజకీయం అయిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలకు సమయం అయిపోయింది. నా విమర్శకులు ఏం మాట్లాడినా నేను పట్టించుకోను..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. బుధవారం నుంచి సచివాలయానికి వెళ్తానని.. పాలనపై, ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెడతానని తెలిపారు. 

రైతు రుణమాఫీ, తడిచిన ధాన్యం కొను గోళ్లు, విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, యూని ఫామ్‌లు, హాస్టళ్లకు సన్నబియ్యం లాంటి కార్య క్రమాల అమలు పనిని ప్రారంభిస్తానని వివరించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో రేవంత్‌ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పాటు పలు అంశాలపై తన ఆలోచనలు పంచుకున్నారు. 

ఒక్క మెదక్‌లోనే బీఆర్‌ఎస్‌ పోటీలో ఉంది
లోక్‌సభ ఎన్నికల్లో 13 స్థానాల్లో విజయం సాధిస్తాం.మహబూబ్‌నగర్‌ పార్లమెంటులో 50 వేల మెజా ర్టీతో గెలవబోతున్నాం. కంటోన్మెంట్‌ అసెంబ్లీలో 20 వేల మెజార్టీతో గెలుస్తాం. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఏం చేసిందన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. బీఆర్‌ఎస్‌ బలవంతంగా మాకు బీజేపీని ప్రత్యర్థిగా సృష్టించింది. బీఆర్‌ఎస్‌ వ్యవస్థనంతటినీ తీసుకెళ్లి బీజేపీకి ఔట్‌సోర్సింగ్‌ చేశారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌ నిలబడుతుందా లేదా అన్నది చూడాలి. ఆ పార్టీకి ఐదారు చోట్ల డిపాజిట్లు రావు. ఒక్క మెదక్‌లోనే పోటీలో ఉంది.

 ఈ ఎన్నికల్లో మోదీ గాలి లేదు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 220కి ఓ పదిశాతం ఎక్కువో, తక్కువో వస్తాయి. కేంద్రంలో సొంతంగా అధికారంలోకి రాదు. 12 సీట్లు గెలిచి ప్రధాని రేసులో ఉంటానన్న కేసీఆర్‌ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ అయినా మాకేం అభ్యంతరం లేదు. మా ప్రభుత్వం పడిపోవాలంటే బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసే ప్రయత్నం చేయాలి కదా. అలా జరిగితే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరూ బీజేపీ వైపునకే వెళ్లాలని ఏముంది? సగం మాతో కూడా రావచ్చు. అలాంటప్పుడు బీఆర్‌ఎస్‌ పార్టీనే మిగలదు.

రైతు రుణాల బాధ్యత తీసుకుంటాం
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)కి అన్ని విషయాలు చెప్పాం. రైతులకు ఏ బ్యాంకులో ఎంత రుణం ఉందో లెక్కలు తీయమని చెప్పాం. ఈ రుణాలకు మేం బాధ్యత తీసుకుంటాం. రైతు సంక్షేమ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, దానికి ఆదాయం చూపించి రుణాలపై బ్యాంకర్లను ఒప్పిస్తాం. రైతులను అప్పుల నుంచి విముక్తులను చేస్తాం. 

అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయాలు
బీఆర్‌ఎస్‌ గత పాలనలో వివాదాస్పదమైన అన్ని అంశాలపై అసెంబ్లీలో లేదంటే అఖిలపక్షం ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటాం. రైతు సంఘాలతో సమావేశమై అభిప్రాయాలు తీసుకుంటాం. రైతుకు పెట్టుబడి, గిట్టుబాటు ధరలు కల్పించడంపై నా ఫోకస్‌ 100 శాతం ఉంటుంది. రైతుబంధు ఇవ్వలేదన్నారు. మే ఆరోతేదీ కల్లా 100 శాతం వేసి చూపించాం. గతంలో డిసెంబర్‌ వరకూ వేసేవాళ్లు. రైతుబంధు కొత్త నిబంధనలపై ఆషామాషీగా నిర్ణయాలు తీసుకోబోం.

రేషన్‌షాపుల్లో సంస్కరణలు
రేషన్‌షాపుల ద్వారా గతంలో మేం 9 వస్తువులిచ్చే వాళ్లం. ఇప్పుడు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. తాజాగా రైతులు పండించే అన్ని పంటలను గిట్టు బాటు ధర కంటే కొంచెం ఎక్కువే ఇచ్చి కొనుగోలు చేసి వాటిని ఉత్పత్తుల కింద మార్చి రేషన్‌షాపుల ద్వారా పేదలకు తక్కువ ధరకు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. వడ్లు కొని మేమే సన్న బియ్యం తయారు చేసి పేదలకిస్తాం. ఇక్కడ పండే దొడ్డు బియ్యాన్ని ఎఫ్‌సీఐకిస్తాం. మిల్లర్లు ఎక్కడైనా తేడా చేస్తే లోపల వేస్తా. రైతుకు, వినియోగదారుడికి మధ్య వారధిగా ప్రభుత్వం ఉంటుంది. 

పదేళ్లలో వందేళ్ల ప్రణాళికలు
పదేళ్లు ఇక్కడే ఉంటా. 2024–34 వరకు తెలంగాణ రాష్ట్రమే నా ప్రపంచం. ఈ పదేళ్లలో వందేళ్లకు సరిపడా ప్రణాళికలు రూపొందించి భావితరాలకు అందించడమే నా బాధ్యత. కొత్తగా మంత్రి పదవులు రెండయితే గ్యారంటీ వస్తాయి. నేనైతే అధిష్టానాన్ని నాలుగు భర్తీ చేసుకునేందుకు అనుమతి అడుగుతున్నా. అనుమతి లభిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు ఒక్కొక్కటి చొప్పున వస్తాయి. 

యూటీ.. ఓ విఫల ప్రయోగం
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేస్తారనే చర్చ చేస్తున్న వారికి మెదడు లేనట్టే. తలకు మాసినోళ్లు చేసే చర్చ అది. యూటీ ఎందుకు చేస్తారు? అదో విఫల ప్రయోగం. 

ఏపీతో సానుకూల వైఖరితోనే ముందుకు..
ఏపీ నుంచి ఎవరు సీఎం అయినా వారితో కలిసి పనిచేస్తా. సానుకూల వైఖరితోనే ముందుకెళ్తా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement