భయపడొద్దు.. అండగా ఉంటాం  | Rahul Gandhi Mulakhat With NCUI Leaders Comes To An End | Sakshi
Sakshi News home page

భయపడొద్దు.. అండగా ఉంటాం 

May 7 2022 2:05 PM | Updated on May 8 2022 1:38 AM

Rahul Gandhi Mulakhat With NCUI Leaders Comes To An End - Sakshi

బల్మూరి వెంకట్, ఇతర ఎన్‌ఎస్‌యూఐ నాయకులతో మాట్లాడుతున్న రాహుల్‌. చిత్రంలో భట్టి

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్‌గాంధీ శనివారం చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎన్‌ఎస్‌ఎయూఐ నేతలతో ములాఖత్‌ అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి వెళ్లి వారిని పరామర్శించారు. భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థి సమస్యలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపైనా పోరాటం చేయాలని సూచించారు. 

మాణిక్యం ఠాగూర్‌ లేఖతో.. 
ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌గాంధీ పర్యటనకు అనుమతివ్వాలంటూ ఎన్‌ఎస్‌ఎయూఐ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మరో 17 మంది కార్యకర్తలను అరెస్టు చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌యూఐ నేతలతో రాహుల్‌ ములాఖత్‌ కోసం.. జైలు సూపరింటెండెంట్, ఆ శాఖ డీజీలను రేవంత్, ఇతర నేతలు కలిసి విజ్ఞప్తి చేసినా అనుమతి లభించలేదు. చివరికి ఏఐసీసీ తరఫున పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ జైళ్లశాఖ డీజీకి లేఖ రాయడంతో ములాఖత్‌ అనుమతి లభించింది. శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు వద్దకు రాహుల్, భట్టి, రేవంత్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డి, మల్లురవి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు వచ్చారు. జైలు అధికారులు రాహుల్, భట్టిలను మాత్రమే ములాఖత్‌ అనుమతించారు. ఈ సమయంలో జైలు గేటు బయట రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

విద్యార్థులపై కేసీఆర్‌ కుట్రలు 
ఓయూకు రావాలని రాహుల్‌గాంధీని దళిత, గిరిజన విద్యార్థులు ఆహ్వానించారని.. ఇందుకోసం అనుమతి అడిగితే వీసీ నిరాకరించడమే కాకుండా విద్యార్థులను నాన్‌Œ బెయిలబుల్‌ కేసుల కింద అరెస్ట్‌ చేయించి జైలుకు పంపించారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ కుట్రలకు ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. జైలులో ఒక్కో ఖైదీని ముగ్గురు ములాఖత్‌లో కలిసే వీలున్నా అధికారులు అనుమతించకపోవ డం సరికాదని విమర్శించారు. కాగా ఎంపీలకు రాష్ట్రపతి, ప్రధాని వద్ద కూడా ప్రోటోకాల్‌ ప్రకారం అనుమతి ఉంటుందని.. అలాంటిది జైలు ములాఖత్‌ నిరాకరించడం అవమానించినట్లేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభు త్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని.. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. 

ఇద్దరి పేర్లే ఇచ్చారు: జైళ్లశాఖ 
చంచల్‌గూడ జైలులో విద్యార్థి నేతలతో ములాఖత్‌ కోసం ఇద్దరి పేర్లను మాత్రమే ఇచ్చారని.. ఆ లేఖ మేరకు రాహుల్, భట్టి విక్రమార్కలను అనుమతించామని జైళ్లశాఖ ప్రకటించింది. ఆ లేఖలో ఎం పీల పేర్లు లేవని పేర్కొంది. ములాఖత్‌ కోసం ఎంపీలమైన తమను రానివ్వకపోవడంపై స్పీక ర్‌కు ఫిర్యాదు చేస్తామని రేవంత్, కోమటిరెడ్డి పేర్కొన్న నేపథ్యంలో జైళ్లశాఖ ఈ వివరణ ఇచ్చింది. 

రిమాండ్‌ ఖైదీలతో ఫొటోలపై దుమారం 
చంచల్‌గూడ జైలులో విద్యార్థులతో రాహుల్‌గాంధీ ములాఖత్‌ వ్యవహారం దుమారం రేపుతోంది. జైలులో ఉన్న బల్మూరి వెంకట్, ఇతర విద్యార్థులను రాహుల్, భట్టి పరామర్శిం చారు. ఈ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా జైలు లోపలికి సెల్‌ఫోన్లు తీసుకెళ్లారని, రిమాండ్‌లో ఉన్న ఖైదీలతో ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పెట్టారని అధికారులు చెప్తున్నారు. ఈ విషయంలో తప్పు ఎవరిదన్న చర్చ జరుగుతోంది. నిబంధనల ప్రకారం జైలు లోపలికి ఫోన్లను అనుమతించరు. ఎంత పెద్ద స్థానంలో ఉన్న వారు వచ్చినా వారి ఫోన్లను బయటే డిపా జిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో నేతల అత్యుత్సాహంతోపాటు చంచల్‌గూడ జైలు అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శలు వస్తున్నా యి. దీనిపై జైళ్లశాఖ ఉన్నతాధికారులను వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.  

చదవండి👉చంచల్‌గూడ ములాఖత్‌కు రాహుల్‌ గాంధీకి అనుమతి.. రాహుల్‌తో పాటు ఆ ఇద్దరికే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement