వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే! | Sakshi
Sakshi News home page

వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే!

Published Sat, May 6 2023 4:01 PM

Purighalla Raghuram Analysis On Tdp And Janasena Alliance - Sakshi

ఏపీ రాజకీయాల సరళి మారి పోబోతున్నట్టుగా కనిపిస్తోంది. పొత్తులు పెట్టుకోక పోతే ఓడటం ఖాయం అన్న నిర్ధారణకు వచ్చిన టీడీపీ, జనసేనతో పొత్తులకు దిగుతు న్నది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో 42 స్థానాలకు గాను  కాంగ్రెస్‌ పార్టీ 22 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ కేవలం 16 సీట్లే గెలుచుకుంది. 1998లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లోనూ టీడీపీకి పరాభవం తప్పలేదు.

కాంగ్రెస్‌ పార్టీ 22 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తే, టీడీపీ కేవలం 12 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానా లను గెలుచుకొని ఏపీలో తన పట్టు నిలబెట్టుకొంది. టీడీపీతో పొత్తు పెట్టుకోక ముందు కూడా ఏపీలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉందన్నది లోక్‌సభ ఎన్నికల్లోనే రుజువయ్యింది.

1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజ యాలతో చంద్రబాబు కన్ను బీజేపీపై పడింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏపీలో సొంతంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోవడం, నాటి ప్రధాని వాజ్‌ పేయిపై ప్రజల్లో సానుకూలత వంటి అంశాలను తనకు అనుకూలంగా మలచుకోవాలని చంద్రబాబు భావించారు. అందుకే 1999లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టి అనూహ్య విజయాలను టీడీపీ పొందింది.

అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఇటు పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ బీజేపీ–టీడీపీ జోడీ అద్భుత విజయాలను అందుకొంది. బీజేపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ 180 అసెంబ్లీ స్థానాల్లో గెలిస్తే, బీజేపీ 12 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందింది. లోక్‌ సభ ఎన్నికల్లో టీడీపీ 29 స్థానాల్లో విజయం సాధిస్తే, కాంగ్రెస్‌ 5 స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఏపీలో 7 లోక్‌ సభ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది. టీడీపీకి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీలో అధి కారం లభించడంతోపాటుగా ఎంపీ స్థానాలను గణనీ యంగా గెలుచుకోగలిగింది. అయితే ఆ తర్వాత చంద్ర బాబు, ఢిల్లీ పెద్దలతో సాగించిన రాజకీయం మనందరం చూశాం.

ఇక 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగానే వెళ్లి చంద్రబాబు తాను మునగడమే కాకుండా బీజేపీనీ దెబ్బతీశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ 5 ఎంపీ స్థానాలకే పరిమితం కాగా, కాంగ్రెస్‌ పార్టీ 29 స్థానాల్లో విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ 5 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. ఒక్కమాటలో చెప్పాలంటే 1999 ఎన్నికల ఫలితాలు 2004లో రివర్స్‌ అయ్యాయి. అలిపిరి దాడిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకోవడం కోసం చంద్రబాబు ఆడిన రాజకీయ జూదంలో బీజేపీ బలిపశువయ్యింది.

2009 ఎన్నికల్లో బీజేపీకి హ్యాండిచ్చి ‘మహా కూటమి’కట్టి.. బాబు ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలతో కలిసినా ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. వైఎస్సార్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ దెబ్బకు చంద్రబాబు మరోసారి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిపోవడం, ఏపీకి మాత్రమే టీడీపీ పరిమితమైన పరిస్థితుల్లో 2014 ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు, బీజేపీతో జట్టుకట్టి ఏపీలో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. అంతే కాదు... తెలంగాణలోనూ ఆ పార్టీ మంచి ఫలితాలను రాబట్టింది. ఏపీలో టీడీపీ 102 స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తెలంగాణలోనూ టీడీపీ 15 చోట్ల విజయం సాధిస్తే, బీజేపీ కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏపీలో అధికారాన్ని అందుకున్న చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత ఎన్డీఏకు గుడ్‌ బై చెప్పి, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి తెలంగాణలో చిత్తు చిత్తయ్యారు. ఇక ఏపీలో ఎలాంటి ఫలితం వచ్చిందో మనందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల్లో జనసేనాని పవన్‌ మద్దతివ్వడంతోపాటు, మోదీ పాపులారిటీ  కూడా టీడీపీ విజయా నికి దోహదపడ్డాయి. కానీ 2019లో సొంతంగా బరి లోకి దిగిన చంద్రబాబు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్ని కల్లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నారు.
చదవండి: ఓటమిలో టీడీపీ రికార్డు.. 50 నియోజకవర్గాల్లో హ్యాట్రిక్‌ పరాజయం!

ఇక జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సైతం ఒక్కో ఎన్ని కలో ఒక్కో రకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ–బీజేపీకి మద్దతి చ్చిన పవన్‌ కల్యాణ్, 2019 ఎన్నికల్లో బీఎస్పీ, లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో చిత్తయ్యారు. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటులోనే ఆ పార్టీ విజయం సాధించింది. తాను బరిలో నిలిచిన రెండు చోట్లా పవన్‌ కల్యాణ్‌ ఓటమి పాలయ్యారు.

ఎన్నిక్లలో ఓటమి తర్వాత బీజేపీతో జట్టు కట్టిన పవన్, మళ్లీ ఎన్నికలు రాబోతుండడంతో చంద్రబాబుపై ప్రేమ ఒలకబోస్తు న్నారు. ఒక్క ప్రజాశాంతి పార్టీతో తప్పించి, రాష్ట్రంలోని అన్ని పార్టీలతో జనసేన పొత్తులు కుదుర్చుకుందన్నది గతం స్పష్టం చేస్తోంది. ఓవైపు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే... పవన్‌ తాజాగా చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నారు. ఈ తరుణంలో ఏపీలో  వైసీపీ, టీడీపీకి సమాన దూరం పాటిస్తోంది బీజేపీ.

పురిఘళ్ల రఘురామ్‌ 
వ్యాసకర్త బీజేపీ సీనియర్‌ నాయకులు

Advertisement
Advertisement