పంజాబ్‌ పర్యటనలో చేదు అనుభవం.. మరోసారి గుర్తు చేసుకున్న మోదీ | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ పర్యటనలో చేదు అనుభవం.. మరోసారి గుర్తు చేసుకున్న మోదీ

Published Tue, Feb 15 2022 7:26 AM

In Punjab, PM Modis Swipe at State Govt Over Security Breach - Sakshi

జలంధర్‌: పంజాబ్‌ గత పర్యటనలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మరోమారు ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. స్థానిక అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో గతంలో తాను జలంధర్‌ ఆలయాన్ని దర్శించుకోలేకపోయానని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలోని పంజాబ్‌లో పరిస్థితులు ఇలా తయారయ్యాయని ఆయన విమర్శలు గుప్పించారు. త్వరలో తాను మరలా జలంధర్‌ వచ్చి దేవీ తాలబ్‌ మందిర్‌ను తప్పక దర్శించుకుంటానన్నారు.

ఎన్నికల సందర్భంగా నగరంలో ఆయన ర్యాలీ నిర్వహించారు. జనవరి 5న పంజాబ్‌ వచ్చిన పీఎం కాన్వాయ్‌ ఒక ఫ్లైఓవర్‌పై చాలాసేపు నిలిచిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రధాని పంజాబ్‌ రావడం ఇదే తొలిసారి. జనవరిలో తాను గుడికి వెళ్లాలని చెప్పగా అధికారులు తనను వెంటనే హెలికాప్టర్‌లో వెనక్కుపొమ్మన్నారని, పంజాబ్‌లో ప్రభుత్వ పనితీరు ఇలా ఉందని ఆయన ర్యాలీలో దుయ్యబట్టారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ క్షీణిస్తోందని, ఆ పార్టీ నాయకులే పార్టీ బలహీనతలు బయటపెడుతున్నారని మోదీ వ్యాఖ్యానించారు.

చదవండి: (Punjab Assembly Election 2022:సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా ఆ ఇద్దరు)

ట్రిపుల్‌ తలాక్‌ రద్దుతో వేలాదిమందికి రక్షణ 
తమ ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేయడంతో వేలాది మంది ముస్లిం మహిళలకు రక్షణ లభించిందని ప్రధాని మోదీ చెప్పారు. యూపీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల ముస్లిం యువత నిర్భయంగా తిరగగలుగుతున్నారని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన దుయ్యబట్టారు. హిందూ ఓట్లను విడగొట్టేందుకే తాము గోవాలో పోటీ చేస్తున్నామన్న టీఎంసీ నేత ప్రకటనను ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని యూపీ ప్రజలు గర్తు పెట్టుకోవాలన్నారు. 

Advertisement
Advertisement