
సాక్షి, ప్రకాశం జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పర్యటనల సందర్భంగా పోలీసు శాఖ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం హోదాలో ఆయనకు జెడ్ ఫ్లస్ సెక్యూరిటీ కింద భధ్రత కల్పించడం లేదు. ఎక్కడికి వెళ్లినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పొదిలి పర్యటనలో ఓ అడుగు ముందుకు వేసి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు.
జగన్ పొదిలి పర్యటన సందర్భంగా అధికార పార్టీ టీడీపీ మార్క్ పోలీసింగ్ కనిపించింది. నిరసన పేరిట ఉద్రిక్తతలకు కారణమైన టీడీపీవాళ్లను వదిలేసి.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. గొడవ చేశారంటూ ఇప్పటికే 15 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లపై బీఎన్ఎస్ సెక్షన్ 109 కింద కేసులు(హత్యాయత్నం) కేసు పెట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది.
అయితే గొడవలు చేసిన వారిని వదిలి పెట్టి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంటున్నారు.
గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులను పరామర్శించేందుకు పొదిలి పొగాకు బోర్డుకు వైఎస్ జగన్ వెళ్లారు. అయితే ఆ పర్యటనలో జగన్ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. నల్ల బెలూన్లు, ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ.. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో మహిళలను ముందుంచి టీడీపీ కార్యకర్తలు కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. తిరిగి వైఎస్సార్సీపీ వాళ్లే ఈ దాడికి పాల్పడారంటూ ఇప్పుడు కేసులు పెడుతున్నారు.