లోకేష్‌ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి: పిఠాపురం వర్మ | Pithapuram Tdp Leader Varma Demands Deputy Cm Post To Nara Lokesh | Sakshi
Sakshi News home page

లోకేష్‌ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి: పిఠాపురం వర్మ

Jan 19 2025 4:44 PM | Updated on Jan 19 2025 5:54 PM

Pithapuram Tdp Leader Varma Demands Deputy Cm Post To Nara Lokesh

సాక్షి,కాకినాడజిల్లా: లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు వర్మ ఆదివారం(జనవరి 19) మీడియాతో మాట్లాడారు.‘నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే. కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్‌కే దక్కుతుంది. పార్టీ పూర్తిగా పోయిందని,టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ లోకేష్ యువ గళంతో సమాధానం చెప్పారు.ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి.

లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముంది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారు.అలాంటిది పార్టీని బలోపేతం చేసి, టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్‌ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి?కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్‌ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నా.ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు.టీడీపీ కార్యకర్తల మనసులో మాట.ఏదేమైనా అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యం’అని వర్మ అన్నారు. 

కాగా, లోకేష్‌ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతోందని ఏలూరు దెందులూరు జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో.. లోకేష్‌ను డీసీఎంను చేస్తే.. పవన్‌ను సీఎం చేయాలనే వాదనను వాళ్లూ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి వయసైపోయిందని, ఆయనకు రిటైర్మెంట్‌ ఇచ్చి పవన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చురకలంటిస్తున్నారు.

మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్‌కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్‌నే వినిపిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ ఉంచారు. ఈ నేతల జాబితాలో పవన్‌కల్యాణ్‌ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చేరడం పొటికల్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ, జనసేన మధ్య సంబంధాలపైనా ఈ వ్యవహారం ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement