
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. జీహెచ్ ఎంసీలో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారు.ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారు
ఆ సంస్థకు హైదరాబాద్ రెండు షోరూములు మాత్రమే ఉన్నాయి. ఆ షోరూమ్ల నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారు. తెలంగాణ కాంట్రాక్టర్లు కర్నాటక షోరూమ్ల డీలర్ల నుంచి ఎంవోయూలు తెచ్చుకున్నా వాటి ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.
ఇప్పటి వరకు జీహెచ్ ఎంసీలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారు.. ఇప్పుడు తొమ్మిది జోన్ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతోంది. అధికారులు పేర్కొన్న స్పెసిఫికేషన్స్ కూడిన వాహనాల్లో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదు. గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో రెండు నుంచి మూడు క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించే వారు.
అధికారులు ఒక సంస్థకు, రెండు కాంట్రాక్టు ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి రూ.5.85 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి.. గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుంది. మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్రెడ్డి తన శాఖలో జరుగుతోన్న అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలి’ అని డిమాండ్ చేస్తూ లేఖలో పేర్కొన్నారు.