మూసీ పక్కన టెంపుల్స్‌ కూల్చే దమ్ముందా?.. కిషన్‌రెడ్డి సవాల్‌ | Minister Kishan Reddy Political Challenge To CM Revanth Reddy, More Details Inside | Sakshi
Sakshi News home page

మూసీ పక్కన టెంపుల్స్‌ కూల్చే దమ్ముందా?.. కిషన్‌రెడ్డి సవాల్‌

Oct 25 2024 12:36 PM | Updated on Oct 25 2024 3:14 PM

Minister Kishan Reddy Political Challenge To CM revanth

సాక్షి, హైదరాబాద్‌: మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా రేవంత్‌ ఉందా? అని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణ బీజేపీ నేతలు ఇందిరా పార్క్‌ వద్ద మూసీ పరివాహక ప్రాంత బాధితులకు మద్దతుగా ‘చేయి చేసిన కీడు-మూసీ బాధితులకు బీజేపీ తోడు పేరుతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌కు సవాల్‌ చేస్తున్నాను. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులతో నివాసం ఉండటానికి మేం సిద్ధం. చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు వెళ్ళడానికి మేం రెడీ. మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు మేం వ్యతిరేకం. పేద ప్రజల గూడు లేకుండా చేయవద్దని కోరుతున్నాను.

మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. రేవంత్ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఒక్క పేద వాడి ఇంటి పనికి కూడా శంకుస్థాపన చేయలేదు. పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్ళు కూల్చివేస్తుంటే ఏం చేయాలో తెలియక బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. పేద ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమం బీజేపీ చేస్తుంది. మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. మూసీ సుందరీకరణ కోసం గత ప్రభుత్వం కూడా పేదలను భయభ్రాంతులకు గురిచేశారు. బీఆర్‌ఎస్‌ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో పర్యటించి.. వారి బాధలు తెలుసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టాలని రేవంత్‌కు కల వచ్చినట్టుంది.

రేవంత్‌కి మరో సవాల్‌ చేస్తున్నా.. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా?. మూసీ పరివాహక ప్రాంతం గురించి రేవంత్‌కి తెలుసా?. మూసీ పక్కన అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. వాటిని కూల్చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. 

పేదల ఇళ్ల జోలికి రావద్దు: కిషన్ రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement