ఖమ్మం మంత్రి గుండాగా మారి, కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నాడు: మధు యాష్కీ గౌడ్

Madhu Yashki Slams On KCR Over TRS Paddy Procurement Deeksha - Sakshi

సాక్షి, ఖమ్మం​: వరంగల్ పట్టణం మే 6నలో కిసాన్ సంఘర్షణ పోరాట సభ జరగనుందని ఆ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు అవుతున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు యాష్కీ గౌడ్‌  తెలిపారు. ఆయన మంగళవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం మంత్రి గుండాగా మారి, కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వేధింపులు తట్టుకోలేక నగరంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిద్ర పోతున్నడా ? అని ప్రశ్నించారు.

రౌడీ మంత్రిని తక్షణమే కేబినెట్ బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి అయిన తారక రామారావు అండ చూసుకుని స్థానిక మంత్రి అజయ్ కుమార్ రెచ్చి పోతున్నాడని దుయ్యబట్టారు. బీజేపీ-మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే..  కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సభ్యుల ఆస్తులపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త.. రాష్ట్రం వచ్చాక రాబందుల సమితిగా మారిందని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మిల్లర్లతో కుమ్మక్కై వేల కోట్ల రూపాయలను దోపిడీ చేస్తోందని మండిపడ్డారు.

బీజేపీ-టీఎర్ఎస్ పార్టీలు కుమ్మకై రైతులను హింస పెడుతున్నాయని అన్నారు. ఢిల్లీ రాజధానిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసింది ధర్నా కాదు.. డ్రామా అని ఎద్దేవా చేశారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రధానమంత్రి మనుషులు హైదరాబాద్‌లో ధర్నా చేస్తారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏసీలు, కూలర్లు పెట్టుకుని డ్రామా చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతంగా ధరలు పెంచుతూ సామాన్యులను హింసకు గురి చేస్తున్నారని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top