పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నమా?: కేటీఆర్‌ | KTR on BRS MLA Kaushik Reddys house arrest | Sakshi
Sakshi News home page

పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నమా?: కేటీఆర్‌

Sep 13 2024 4:58 AM | Updated on Sep 13 2024 6:28 AM

KTR on BRS MLA Kaushik Reddys house arrest

ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా?.. మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపాటు 

ప్రతిఘటన తప్పదంటూ హెచ్చరిక 

సాక్షి, హైదరాబాద్‌:  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసి.. పోలీసుల సాయంతో అరికెపూడి గాంధీ గుండాలు రెచ్చిపోయి దాడులకు పాల్పడటం దారుణమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇంతకు మించి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. 

‘‘పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లా అండ్‌ ఆర్డర్‌ ఉందా? ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ప్రభుత్వం దాడి చేయించటమే ఇందిరమ్మ పాలన, ప్రజా పాలనా?’’అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ చేస్తున్న అరాచకాలను కచి్చతంగా రాసి పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. అరికెపూడి ఇంటికి వెళ్తానన్న కౌశిక్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు.. అరికెపూడిని మాత్రం కౌశిక్‌రెడ్డి ఇంటికి వచ్చేందుకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు.

వందల మంది కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేశారంటే పక్కాగా ముందస్తు ప్లాన్‌ ప్రకారమే దాడి చేశారని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఫ్యాక్షనిజానికి, రౌడీయిజానికి అడ్డాగా మార్చేస్తుండటం చూస్తుంటే బాధగా ఉందని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా సీఎం రేవంత్‌రెడ్డి చేయించిన దాడేనని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తున్న కౌశిక్‌రెడ్డిని ప్రభు త్వం టార్గెట్‌ చేసిందని ఆరోపించారు. కావాలనే అక్రమ కేసులు, హత్యాయత్నాలకు పాల్పడి బెదిరించే ప్రయత్నం చేస్తోందని  విమర్శించారు. 

బీఆర్‌ఎస్‌ స్థైర్యాన్ని దెబ్బతీయలేరు.. 
‘‘సీఎం రేవంత్‌రెడ్డీ.. మా పార్టీ సైనికుల పోరాటాని కి నీకు నచ్చిన పేరు పెట్టుకో. కాంగ్రెస్‌ గూండాల దౌర్జన్యాలు, దాడులు బీఆర్‌ఎస్‌ సైనికుల స్థైర్యాన్ని ఇసుమంత కూడా దెబ్బ తీయలేవు. తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని మీ అవినీతి, దుర్మార్గ పాలన నుంచి కాపాడుకుంటాం. కౌశిక్‌రెడ్డితో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు..’’అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement