కవిత వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించడమే: కొండ సురేఖ | Konda Sureka Comments On MLC Kavitha Comments | Sakshi
Sakshi News home page

కవిత వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించడమే: కొండ సురేఖ

Feb 8 2024 2:02 PM | Updated on Feb 8 2024 3:31 PM

Konda Sureka Comments On MLC Kavitha Comments - Sakshi

టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని కవిత మాట్లాడడం విడ్డూరం..

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి కొండ సురేఖ అన్నారు. ఆంధ్ర వ్యక్తిని నియమించారని మాట్లాడటం చూస్తుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. పదేండ్లు పాలన చేసిన వాళ్లు రెండు నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రాల  కాంట్రాక్టులను పెంచి పోషించినది కేసీఆరేనని అన్నారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే బీఆర్‌ఎస్ పాలనలో డీజీపీగా ఎందుకు పెట్టారు? అని నిలదీశారు. 

సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే తప్పుపడుతున్నారు కానీ బీఆర్‌ఎస్ దళారులు సింగరేణిలో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని అన్నారు.  మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ చేశారా? లేక ఒకే రూమ్ లో కావాల్సిన వాళ్లకు పరీక్షా రాయించారా?  అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదు.. తాము ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

సింగరేణి నిధులు, ఉద్యోగాలు ఎవరు తన్నుకుపోయారో అందరికి తెలుసని కొండ సురేఖ అన్నారు.  సింగరేణిలో డిప్యూటేషన్, బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత దండుకున్నావ్.. లెక్కలు తీయాలా? అని ప్రశ్నించారు.  పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు.

ఇదీ చదవండి: ‘నేను హోం మంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్‌లో ఉంటారు’

Advertisement
 
Advertisement
Advertisement