కల నెరవేరేనా.. మినిస్ట్రీ దక్కేనా? | Komatireddy Raj Gopal Reddy on Minister Post | Sakshi
Sakshi News home page

కల నెరవేరేనా.. మినిస్ట్రీ దక్కేనా?

Jun 10 2026 12:22 PM | Updated on Jun 10 2026 12:42 PM

Komatireddy Raj Gopal Reddy on Minister Post

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండున్నర ఏళ్లుగా జిల్లాలో మూడో మంత్రి పదవి కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర కేబినెట్‌ విస్తరణ జరుగుతుందన్న చర్చ నేపథ్యంలో మంత్రి పదవిపై చర్చ జోరందుకుంది. ఈసారైనా జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నేనావత్‌ బాలునాయక్‌లలో ఎవరిని మినిస్ట్రీ వరిస్తుందన్న చర్చ సాగుతోంది. ఎప్పుడు కేబినెట్‌ విస్తరణ అంశం తెరపైకి వచ్చినా.. మొదట జిల్లా నేతలకు మంత్రి పదవిపైనే చర్చ జరగడం పరిపాటిగా మారింది. అయితే, ఈసారి పరిస్థితి సానుకూలంగా ఉండొచ్చని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

రాజగోపాల్‌రెడ్డికి సంకేతాలు!
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలువడంతో ఈ చర్చకు మరింత బలం చేకూరింది. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం గతంలోనే హామీ ఇచ్చింది. కానీ, సామాజిక సమీకరణల దృష్ట్యా ఆయనకు అప్పడు మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయన కొంత నిరాశకు గురయ్యారు. మళ్లీ విస్తరణలో అవకాశం కల్పిస్తామని అధిష్టానం నుంచి రాజగోపాల్‌రెడ్డికి సంకేతాలు అందినట్లు సమాచారం. ప్రస్తుతం త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఈసారి రాజగోపాల్‌రెడ్డి పక్కా బెర్త్‌ లభిస్తుందన్న చర్చ సాగుతోంది. ఇటీవల ఆయన రాహుల్‌గాంధీతో భేటీ అయిన సందర్భంలోనూ తనకు అధిష్టానం ఏం హామీ ఇచ్చింది... తనకు అప్పగించిన బాధ్యతలను పక్కాగా ఎలా నిర్వర్తించారు.. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకతపై రాహుల్‌గాంధీకి వివరించినట్లు తెలిసింది. రాజగోపాల్‌రెడ్డి మాత్రం.. తాను రాహుల్‌గాంధీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు పేర్కొన్నారు.

బాలునాయక్‌కు అవకాశం
దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌ కూడా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జిల్లా నుంచి బలహీనవర్గాల కోటాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదీ పాత తరం వారికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. కొండా లక్ష్మణ్‌ బాపూజీ, కొమ్ము పాపయ్య, రవీంద్రనాయక్‌కు 1985కు ముందు మంత్రి పదవులు దక్కగా, ఆ తరువాత బలహీనవర్గాల కోటాలో మరెవరికి మంత్రి పదవి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా జిల్లాలో అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో సీనియర్‌ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని గతంలోనే ఎమ్మెల్యే బాలునాయక్‌ అధిష్టానాన్ని కోరారు. రాష్ట్ర కేబినెట్‌లో ఆదివాసీల నుంచి సీతక్కకు మంత్రి పదవి దక్కగా, లంబాడా కోటాలో బాలునాయక్‌కు ఇస్తారని, సీఎం రేవంత్‌రెడ్డి కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్లు అప్పట్లో చర్చ జరిగింది.

నెలాఖరులో కేబినెట్‌ విస్తరణ?
ఈ నెల 18వ తేదీతో రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి. ఆ తరువాత రాష్ట్ర కేబినెట్‌ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు మరో మంత్రి పదవి ఇస్తారని, ఏ క్షణంలోనైనా పిలుపురావచ్చన్న చర్చ కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లా నుంచి రాజగోపాల్‌రెడ్డి, బాలునాయక్‌లలో ఎవరో ఒకరికి మాత్రం పక్కాగా మంత్రి పదవి వస్తుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement