మెడికల్‌ సీట్లపై హరీశ్‌ రావు ఆగ్రహం.. ప్రభుత్వానికి ప్రణాళిక లేదు | harish rao slams on congress government over medical seats | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు.. పంచాయతీలకు 8 పైసలైనా ఇచ్చారా?’

Aug 7 2024 5:50 PM | Updated on Aug 7 2024 6:21 PM

harish rao slams on congress government over medical seats

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదని మండిపడ్డారు. ఆయన బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 

‘‘ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రణాళిక లేదని మెడికల్ సీట్ల విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ విద్యార్థులు స్థానికేతరులుగా పరిగణించేలా కుట్రలు జరుగుతున్నాయి. 2018 లో బీఆర్ఎస్ ప్రభుత్వం 114  జీవో ఇచ్చి 95 శాతం ఉద్యోగాలన్ని తెలంగాణకే దక్కే విధంగా ఉత్తర్వులు ఇచ్చాము. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్ రాజధానిగా ఉంది. ఈ పదేళ్లు ఏపీలోని విద్యార్థులు 15 శాతం ఇక్కడ చదువుకోవచ్చని చెప్పింది. 

.. డాక్టర్లు కావాలని పిల్లల తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. కానీ వారి కలలు కల్లల్లుగా మారే పరిస్తితికి వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెడికల్ సీట్ల సంఖ్య పెంచాము. జీవో సవరించి 520 సీట్లు పెరిగేలా మేము కృషి చేశాం. బీ కేటగిరి సీట్లలో కూడా లోకల్ రిజర్వేషన్లు ఉండేలా తెలంగాణ పిల్లలకు దక్కేలా చేశాం. ఆదరాబాదరాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ విద్యార్థులకు అన్యాయం, నష్టం జరిగేలా వ్యవహరిస్తోంది. 

ప్రభుత్వం ‘స్వచ్ఛదనం  పచ్చదనం’ అని అయిదు రోజుల కార్యక్రమం ప్రారంభించింది. ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదు. గ్రామాల్లో సమస్యలు గుర్తించి చెప్పాలని అంటున్నారు. క్లీనింగ్ కోసం బ్లీచింగ్ పౌడర్ చల్లాలని చెప్పింది మరీ డబ్బులు ఎక్కడివి. సర్పంచులు, పంచాయతీ సెక్రటరీల దగ్గర డబ్బే లేదు. డీజిల్ లేక ట్రాక్టర్లు ఆగిపోయాయి. గ్రామ పంచాయతీలో కరెంట్ బిల్లులు పేరుకుపోయాయి. సిబ్బందికి జీతాలు లేవు. మరి ఎక్కడి నుంచి ‘స్వచ్ఛదనం  పచ్చదనం’ ఎలా చేస్తారు. ఇవాల్టికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గ్రామ పంచాయతీలకు 8పైసలైన ఇచ్చారా? ఆసుపత్రుల్లో మందులు లేవు’ అని అన్నారు.అని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement