బనకచర్లతో తెలంగాణకు భారీ నష్టం | Harish Rao Sensational Comments On Godavari Banakacherla | Sakshi
Sakshi News home page

బనకచర్లతో తెలంగాణకు భారీ నష్టం

May 26 2025 5:44 AM | Updated on May 26 2025 5:44 AM

Harish Rao Sensational Comments On Godavari Banakacherla

సాగునీటి ప్రయోజనాలు కాపాడటంలో సర్కారు విఫలం : హరీశ్‌రావు

అనుమతుల్లేకున్నా కేంద్ర సహకారంతో ఏపీ పనులు చేసేస్తోంది

రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌పట్టించుకోవడం లేదు

ప్రాజెక్టును ఆపకుంటే ఢిల్లీ సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర సాగు నీటి ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కడుతుంటే అడ్డుకోవలసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు.. తమకేమీ పట్టనట్లుగా ఉన్నారని ధ్వజమెత్తారు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

జల దోపిడీ మళ్లీ షురూ 
ఉమ్మడి పాలనలో సాగిన జల దోపిడీ, నేడు కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ మొదలైందని, ఎప్పటిలాగే పదవుల కోసం పెదవులు మూసుకుంటున్నారని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలకు నీళ్లొదిలి సీఎం రేవంత్‌రెడ్డి గురు దక్షిణ చెల్లించుకుంటూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. బనకచర్ల ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ కుట్ర చేస్తోందన్నారు.

ఇందుకు సహకరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని విమర్శించారు. నాడు తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని లేఖలు రాసిన చంద్రబాబు నేడు మిగులు జలాలను తీసుకుంటున్నట్లు చెప్పడం శోచనీయమన్నారు. ఏ ఒక్క అనుమతి లేకుండా, నిబంధనలు బుల్డోజ్‌ చేస్తూ, కేంద్రం జుట్టు తమ చేతిలో ఉందని ఏపీలో రాత్రికి రాత్రి పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.  

అనుమతుల్లేని ప్రాజెక్టుకు నిధులెలా ఇస్తారు? 
    గత అసెంబ్లీలో నీతి అయోగ్‌ బహిష్కరిస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందరి కంటే ముందే నీతి అయోగ్‌ మీటింగ్‌కు వెళ్లారని, బనకచర్లను అడ్డుకుంటారని భావిస్తే ఏమీ మాట్లాడకుండా వచ్చారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టుకు 50 శాతం కేంద్రం గ్రాంటు ఇవ్వడంతో పాటు, మరో 50 శాతం ఎఫ్‌ఆర్‌బీఎంను మించి రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తారని చెపుతున్నారని.. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించే ప్రాజెక్టుకు ఇలా నిధులు, అనుమతులు, రుణాలు ఎలా ఇస్తారని నిలదీశారు. కిషన్‌రెడ్డి చొరవ చూపి ఈ ప్రాజెక్టును ఆపాలన్నారు. లేదంటే ఢిల్లీ సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.  

తెలంగాణపై ఎందుకింత కక్ష? 
    పోలవరానికి జాతీయ హోదా ఇచి్చ..కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వరని హరీశ్‌రావు ప్రశ్నించారు. పోలవరానికి రూ.80 వేల కోట్లు, బనకచర్లకు రూ.80 వేల కోట్లు కలిపి రూ.1.6 లక్షల కోట్లు ఏపీకి ఇస్తున్నప్పుడు, తెలంగాణ ప్రాజెక్టులకు అందులో ఒక్క శాతం అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై బీజేపీకి ఎందుకింత కక్ష, సవతి తల్లి ప్రేమో అర్థం కావడం లేదన్నారు.

కృష్ణాలో వాటా కోసం కేసీఆర్‌ పోరాటం చేసి సెక్షన్‌ 3ని సాధించారని,. కొత్త ట్రిబ్యునల్‌ సాధించారని చెప్పారు. గోదావరి మీద కూడా భవిష్యత్తులో కొత్త ట్రిబ్యునల్‌ వస్తుందని భావించి ప్రాణహితకు 160 టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటే, కాళేశ్వరానికి 240 టీఎంసీల నీటి కేటాయింపులు చేసినట్లు తెలిపారు. ఈ విధంగా పలు ప్రాజెక్టులు చేపట్టి కొన్నింటిని పూర్తి చేశామని వివరించారు. కాంగ్రెస్‌ వాళ్లు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఉండబట్టే నీళ్లు కిందకు వెళుతున్నాయని అన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement