
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసు కేసు(Formula E-Car Race Case) లో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్పాలిటిక్స్లో భాగంగా పెట్టిన అక్రమ కేసు ఇదని.. ఇలాంటి కేసులో జైలుకు వెళ్తేందుకు కూడా తాను సిద్ధమని సోమవారం తెలంగాణ భవన్ వద్ద ఆయన ప్రకటించారు.
‘‘ పైచాచిక ఆనందం పొందేందుకు మాత్రమే నా పైన కేసులు పెడుతున్నారు. ఆరు నెలలుగా విచారించి ఏం తేల్చారు? ఫార్ములా ఈ-రేస్ కేసులో అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు. అరెస్ట్ చేసినా కూడా భయపడను. వెనక్కి తగ్గం. జైలుకు వెళ్తేందుకు కూడా సిద్ధం. నాకు జైలు కొత్తేమీ కాదు. తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తిని నేను. ఫార్ములా ఈ-రేసు అంశం నాలుగు గోడల మధ్య నన్ను విచారించడం కాదు. అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దామని నేను చెబుతున్నా. చర్చించే దమ్ము, ధైర్యం లేక రేవంత్ రెడ్డి పారిపోయారు. రేవంత్కు ఇదే నా సవాల్.. లై డిటెక్టర్ టెస్ట్కు కూడా నేను సిద్ధమే అని కేటీఆర్(KTR) అన్నారు.
అందాల పోటీలు పెట్టీ ప్రపంచం ముందు అభాసుపాలు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి(Revanth Reddy). కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పుకునేందుకు ఏం లేదు. రైతుబంధును కాస్త ఎలక్షన్ బంధుగా మార్చేశారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ అక్రమ కేసు. మాకు చట్టం, కోర్టు అంటే గౌరవం ఉంది. అందుకే మూడు సార్లు కాదు.. 30 సార్లు పిలిచిన విచారణకు వెళ్తాను.
బీసీలకుకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారు. బీసీలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల వైపు ఉండి నిలదీస్తూనే ఉంటాం. దున్నపోతు ఈనింది అంటే దూడనీ కట్టేయమని బీజేపీ అంటుంది. కాంగ్రెస్-బీజేపీవి దొంగాటలు. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు అయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తునే ఉంటాం. జై తెలంగాణ అంటూ ఏసీబీ ఆఫీస్కు బయల్దేరారు. అంతకు ముందు..

ఈ ఉదయం కోకాపేట నివాసం నుంచి తొలుత నందినగర్ నివాసానికి కేటీఆర్ చేరుకున్నారు. అక్కడ హరీష్ రావు, మరికొందరు పార్టీ నేతలతో కలిసి అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆపై భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు.