దుబ్బాకలో గెలిచింది బీజేపీ కాదు.. | Dubbaka Results: Dubbaka Election Results: Its Raghunandan Rao Victory Not BJP Ponnam Prabhakar Say | Sakshi
Sakshi News home page

‘టీఆర్‌ఎస్‌ ఓడిపోవాలనే కసితో ప్రజలు ఓట్లు వేశారు’

Nov 11 2020 3:34 PM | Updated on Nov 11 2020 3:40 PM

Dubbaka Results: Dubbaka Election Results: Its Raghunandan Rao Victory Not BJP Ponnam Prabhakar Say - Sakshi

కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే టీఆర్‌ఎస్‌లోకి పోతాడని బీజేపీ దుష్ర్పచారం చేయడంతో..

సాక్షి, ఖమ్మం : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోవాలనే కసితో ప్రజలు బీజేపీకి ఓట్లు వేశారని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే టీఆర్‌ఎస్‌లోకి పోతాడని బీజేపీ దుష్ర్పచారం చేసిందని, అందుకే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. బుధవారం ఆయన పొన్నాల లక్ష్మయ్యతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో సానుభూతితో రఘునందన్‌రావు గెలిచాడే తప్ప బీజేపీ గెలువలేదన్నారు. మాజీ పీసీసీ ప్రెసిడెంట్‌ పొన్నాల లక్ష్మయ్య మాట్లాతుడూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నియంతృత్వ సాగువిధానం తీసుకురావటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. కౌలు రైతులను నిండా ముంచిన ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని విమర్శించారు. 



భట్టి ర్యాలీకి ఘన స్వాగతం 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో ప్రజలు, రైతులు కదం తొక్కారు. ఒక్కరుగా మొదలై వేల సంఖ్యలో రైతులు తమ ట్రాక్టర్లతో సహా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ర్యాలీకి ప్రజలు అడుగడుగునా జన నీరాజనం పలికారు. ప్రతి గ్రామంలో భట్టి బృందానికి పూలు జల్లుతూ.. డప్పులతో మోత మోగిస్తూ ఘన స్వాగతం పలికారు. మధిరలో మొదలైన ర్యాలీకి ప్రతి గ్రామంలో రైతులు తమంతకు తాముగా చేరారు. ఒకానొక దశలో ర్యాలీ అనుకన్న సమయం కన్నా ఆలస్యంగా ముందుకు సాగింది.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు సారధ్యంలో జరుగుతున్న ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement