సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333కు చేరింది. అందులో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్ ప్రకటించారు.
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు/ కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 19 వరకు గడువు ఉందని తెలిపారు. సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులను పరిష్కరించి అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ ఓటర్ల జాబితానే వినియోగించనున్నారు. ఇక రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలుండగా, ముసాయిదా జాబితాలో 3,06,26,996 మంది సాధారణ ఓటర్లతో పాటు మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15,337 మంది సరీ్వసు ఓటర్లున్నారు. 18–19 వయస్సు కలిగిన యువ ఓటర్ల సంఖ్య 4,76,597.
కొత్త ఓటర్లు 8,31,520 మంది  
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా గత జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,99,77,659 మంది ఓటర్లు ఉండగా, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 8,31,520 మంది ఓటర్లను నమోదు చేశారు. 1,82,183 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు.  
ఓటు తొలగిస్తే 15 రోజుల్లోగా అప్పీల్ చేయాలి
ముసాయిదా జాబితాలో ఎవరిదైన పేరును తప్పుగా తొలగిస్తే బాధిత ఓటర్లు  15 రోజుల గడువులోగా జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోవాలని సూచించారు. లేకుంటే మళ్లీ కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం–6 దరఖాస్తు చేసుకోవాలని కోరారు.  
‘ఓటర్ల’ అధికారుల బదిలీలపై నిషేధం
సీఈఓ వికాస్రాజ్ ఆదేశాలు 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా రూ పకల్పనలో పాలుపంచుకుంటున్న అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఓటర్ల జాబితా సవరణలో కీలకమైన జిల్లా ఎన్నికల అధికారులు, ఉప జిల్లా ఎన్నికల అధికారులు, ఓటర్ల నమోదు అధికారులు, సహాయ ఓటర్ల నమోదు అధికారులు తదితర స్థాయి అధికారుల బదిలీలపై ఈ నెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు నిషేధం అమల్లోకి ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్ సోమవా రం ఉత్తర్వులు జారీ చేశారు.
ఓటర్ల జాబితా తయారీ బాధ్యతల్లోని అధికారులను బదిలీ చేస్తే జాబితా నాణ్యతపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ అత్యవసరంగా ఎవరైనా అధికారిని బదిలీ చేయాల్సివస్తే స్పష్టమైన వివరాలు అందజేసి ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి నుంచి బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ) వరకు బదిలీలు, పోస్టింగ్ల విషయంలో ఈ నిబంధన లు వర్తిస్తాయన్నారు. దీర్ఘకాలిక సెలవు ల్లో వెళ్లడానికి ముందు ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని అధికారులను సూచించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
