
మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలను సాగనంపేందుకు యత్నాలు
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గ టీడీపీలోని విభేదాలు రచ్చకెక్కాయి. ఇదే పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మూడు మండలాలు, మున్సిపాలిటీకి చెందిన నేతలంతా తీర్మానం చేశారు. తీర్మానాన్ని పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు బుధవారం మీడియాకు వెల్లడించారు. వీరి వెనుక నియోజకవర్గానికి చెందిన కీలక నేత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికలకు ముందు టీడీపీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జిగా బోనెల విజయచంద్రను పార్టీ అధిష్టానం నియమించింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్లను విజయచంద్ర కలుపుకొని వెళ్లకుండా పూర్తిగా పక్కన పెట్టేశారని, సీనియర్లన్న గౌరవం లేకుండా వ్యవహరించేవారన్న విమర్శలు అప్పట్లో బలంగా వినిపించాయి. టీడీపీలో ఉంటూ సొంత పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేశారన్నది మరో ఆరోపణ.
ఎన్నికలకు ముందు ఏ కార్యక్రమం చేపట్టినా ద్వారపురెడ్డి, బొబ్బిలి చిరంజీవులును బోనెల విజయచంద్ర ఆహ్వానించకుండా నిర్లక్ష్యం చేశారని జగదీష్ వర్గం చెబుతోంది. ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన విజయచంద్ర విజయం సాధించారు. ఆ తర్వాత పార్వతీపురంలో జరిగిన విజయోత్సవ సభలో ఆ సీనియర్ నేతలిద్దరూ హాజరు కాకపోవడం.. అదే వేదికపై పార్టీలో ఉంటూ ద్రోహం చేసిన వారిని ఉపేక్షించమని ఎమ్మెల్యే పరోక్షంగా హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.
అక్కడ భేటీ.. ఇక్కడ సస్పెండ్కు తీర్మానం
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఇటీవల మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గ టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. పార్టీకి అన్యాయం చేసి.. మరలా ఏ ముఖం పెట్టుకుని అధినేతను కలిసి వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
పార్వతీపురం పట్టణంలో మూడు మండలాలు, మున్సిపాలిటీకి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ద్వారపురెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యే చిరంజీవులును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తామంతా తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపిస్తున్నట్లు వెల్లడించారు. సీతానగరం, బలిజిపేట, పార్వతీపురంలలో వారి అనుచరగణం కూడా పార్టీకి వ్యతిరేకంగా పని చేసిందని.. అందరినీ అధిష్టానం బహిష్కరించాలని డిమాండ్ చేశారు.