Munugode By Elections 2022: Communist Parties Likely Support TRS Party - Sakshi
Sakshi News home page

Munugode Politics: ఆ పార్టీ సరేనంటే.. కమ్యూనిస్టులు అటువైపే..!

Aug 16 2022 6:14 PM | Updated on Aug 16 2022 6:26 PM

Communist Parties may Support to TRS party in Munugode Election - Sakshi

సాక్షి, నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా.. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడంపైనే కమ్యూనిస్టులు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఓటమే లక్ష్యంగా సీపీఎం, సీపీఐ పావులు కదుపుతున్నాయి. టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒకటి రెండు సీట్లపై దృష్టి పెట్టి అధికార పార్టీతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అలా సర్దుబాటుకు అధికార పార్టీ సరేనంటే.. కమ్యూనిస్టులు టీఆర్‌ఎస్‌వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

మునుగోడు ఉప ఎన్నికలపై కమ్యూనిస్టులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. సీపీఐ, సీపీఎంలు వేర్వేరుగా నియోజకవర్గ సమావేశాలతోపాటు జిల్లా కార్యవర్గ సమావేశాలను నిర్వహించాయి. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే లాభమా..? లేక శత్రువును ఓడించేందుకు మరొకరికి మద్దతు ఇవ్వాలా..? అన్న ఆలోచనలు చేశాయి. అందులో కొందరు పోటీ చేయాలని, మరికొందరు మద్దతు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. తాము పోటీ చేస్తే.. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలుతాయని, తద్వారా బీజేపీ అభ్యర్థికి మేలు జరిగే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చాయి.

చదవండి: (వేడెక్కిన మునుగోడు రాజకీయం.. అర్థరాత్రి హైడ్రామా)

మద్దతుపైనే ఆలోచన..
రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీచేయగా.. సీపీఐ, కాంగ్రెస్‌ కలిసి పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఇక 2018 ఎన్నికల్లో సీపీఐ.. కాంగ్రెస్‌ పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటించింది. సీపీఎం.. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌(బీఎల్‌ఎఫ్‌)గా పోటీలో నిలిచింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి రాజగోపాల్‌రెడ్డి గెలిచారు. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే తాము పోటీ చేసే కంటే మరొకరికి మద్దతు ఇస్తేనే బీజేపీని అడ్డుకోగలమన్న ఉద్దేశంతో సీపీఎం, సీపీఐ ఉన్నట్లు తెలిసింది.

అందుకు కాంగ్రెస్‌ పార్టీ కంటే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తేనే తమ లక్ష్యం నెరవేరుతుందన్న భావనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు తాము సహకరిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీలకు కనీసంగా రెండు మూడు సీట్లను పొత్తులో భాగంగా సాధించుకోవాలన్న వ్యూహంతో ఉన్నారు. ఇదే విషయాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ ముందు పెట్టినట్లు తెలిసింది.    

Advertisement
 
Advertisement
Advertisement