విచారణ పేరుతో వేధింపులు.. న్యాయ పోరాటం చేస్తా: చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి | Chevireddy Mohith Reddy Serious Comments On TDP And AP Govt | Sakshi
Sakshi News home page

విచారణ పేరుతో వేధింపులు.. న్యాయ పోరాటం చేస్తా: చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి

Jul 28 2024 8:23 AM | Updated on Jul 28 2024 11:11 AM

Chevireddy Mohith Reddy Serious Comments On TDP And AP Govt

సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి. కావాలనే కక్షపూరితంగా కేసులో ఇరికించారని ఆయన మండిపడ్డారు. విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, మోహిత్‌ రెడ్డి ఆదివారం ఉదయం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘నాపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తాం. పులివర్తి నానిపై ఎక్కడా దాడి జరగలేదు. ఘటన జరిగిన 52 రోజుల తర్వాత ఏ-37గా నా పేరును చేర్చారు. ఈ ఘటన జరిగిన రోజు నా ఎదురుగానే జయింట్‌ కలెక్టర్‌ కూడా ఉన్నారు. సెల్‌ఫోన్‌ కూడా లోపలికి తీసుకెళ్లకూడదు అంటే నేను తీసుకెళ్లలేదు. నా ఫోన్‌ను నా పీఏకు ఇచ్చి నేను లోపలికి వెళ్లాను. 

ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారు. సీఆర్‌పీఎసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. మా నాన్నను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారు. మా నాన్నను స్ఫూర్తిగా తీసుకుని పోరాడుతాం. మేము బ్రతికి ఉన్నంత కాలం ప్రజల కోసమే పోరాడుతాం. టీడీపీ నేతలు చంద్రగిరి నియోజకవర్గంలో బీభత్సం సృష్టిస్తున్నారు. మీరు చేసే అన్ని దందాలను ప్రజలకు వివరిస్తాం. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

తప్పుడు కేసులతో మనుగడ సాధించలేరు: చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ.. మోహిత్ రెడ్డిపై 52 రోజులు తర్వాత తప్పుడు కేసు పెట్టారు. మేము నిత్యం ప్రజల్లో ఉండే వాళ్లం. నా పోరాటం ఎలా ఉంటుందో నేను చూపిస్తా అంటున్నాడు మోహిత్ రెడ్డి. తప్పుడు కేసులతో మనుగడ సాధించలేరు. మీకు దమ్ము ఉంటే,  ధైర్యం ఉంటే మెజిస్ట్రేట్ ముందు మీరు హాజరుపరచాలి. జడ్జి ముందు హాజరు పరిచే ధైర్యం లేదు. మీరు పెట్టిన తప్పుడు కేసులు చూసి వాళ్లకు ఖచ్చితంగా చివాట్లు పెడతారు.

ఒక సెన్సేషనల్ కోసమే అదుపులోకి తీసుకున్నారు. 41 కింద నోటీసు ఇచ్చేందుకు తీసుకు వచ్చారు. మోహిత్ రెడ్డిపై ఏ రకంగా లుక్ అవుట్ నోటీస్ ఇస్తారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే జడ్జి ముందు ప్రవేశ పెట్టండి. ఇప్పుడు 41 నోటీస్ ఇచ్చి వదిలి పెట్టారు. తిరుపతి నగరం మొత్తం దిగ్బంధం చేశారు. భారీ ఎత్తున పోలీసులు మోహరింపు ఎందుకు?. 41 నోటీసులు ఇవ్వడానికా ఇంత రాద్దంతం చేస్తారా?. ఓటు వేసిన ప్రజల్ని వదిలేట్టే ప్రసక్తే లేదు. ప్రజలపై ఉన్న కోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చూపిస్తున్నారు. పులివర్తి నానిపై దాడి జరగలేదు అని స్విమ్స్ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు.  37 మంది దాడి చేస్తే నానిపై ఒక్కగాయం కూడా కాలేదు.  ఈ దాడిలో ఉన్నాడని ఎలా కేసు పెడతారు. కావాలనే కక్ష్య పూరితంగా కేసులో ఇరికించారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement