సాక్షి, అమరావతి: రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేశారు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసంపై రాయచోటి ప్రజలు మండిపడుతున్నారు.
కాగా, ఏపీ కేబినెట్లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానమే జరిగింది.
రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు ఇస్తూ.. డ్రామాను రక్తి కట్టించారు.


