సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్లో విజయ దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.
హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం ఒక్కటై మరో పోరాటానికి సిద్ధం కావాలి. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రజల ఆశీర్వాదంతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. పదవులను గడ్డి పూసలా వదిలేసిన వ్యక్తి కేసీఆర్. నిమ్స్ ఆస్పత్రిలో ప్రాణం మీదికి వచ్చిన దీక్ష విరమించని వ్యక్తి ఆయన. కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. ఆయన దీక్ష లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని హరీష్ రావు పేర్కొన్నారు. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2 తేదీలు తెలంగాణ చరిత్రలో మర్చిపోలేనివని గుర్తుచేశారు.
కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమ ద్రోహులు చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డి పేరు తప్పక రాయాల్సి వస్తుందని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అంటే ద్రోహి, వెన్నుపోటు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదని, రెండేళ్లుగా ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రామోజీరావు కంటే గొప్ప అవార్డు లేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. కాళోజి, దాశరధి, గద్దర్ పేర్లతో ఇచ్చే అవార్డులను అవమానించడం, రేడియల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టే ప్రయత్నం, ఒకప్పుడు సోనియా గాంధీని బలిదేవత అని మాట్లాడిన రేవంత్ నేడు సోనియాగాంధీ దేవత అంటున్నాడని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
ఆనాడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే. సమైక్య పాలకులు యాదిరెడ్డి శవాన్ని ఏపీ భవన్కు రానివ్వలేదు. ఢిల్లీ పోలీసులు మా మీద కేసులు పెడితే దానికి మేము కొన్ని సంవత్సరాలు ఢిల్లీ తిరగాల్సి వచ్చింది. తెలంగాణ జైత్రయాత్రను కేసీఆర్ శవయాత్ర అని నినదించినప్పుడు, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అంటూ హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.


