సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణ కచ్చితంగా భూమిపుత్రుల జాగీరే. పవన్ కల్యాణ్ను ఎవరు అడ్డుకున్నారు?. జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది?. 2023లో జనసేన పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ ఆవిర్భావం రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది?. జాతీయ వాదంపై ప్రధాన మంత్రి మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తాజాగా కేటీఆర్ స్పందిస్తూ..‘దేశంలో ఎవరైనా పార్టీ పెట్టి పోటీ చేసుకోవచ్చు. ఎక్కడ పోటీ చేస్తారో ఆ ప్రాంత పరిస్థితులు తెలుసుకోవాలి. తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ ను ఎవరు అడ్డుకున్నారు. తెలంగాణ ప్రజలు మాత్రమే పవన్ను అడ్డుకున్నారు. ఓటమిని చూపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ మీటింగ్ పెట్టి విభజన సరిగా జరగలేదని అంటున్నారు. మీ కుటుంబాలు, మీ వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయి. తెలంగాణలోనే ఉన్నాయి కదా.
తెలంగాణ నాలుగు కోట్ల భూమి పుత్రులది. తెలంగాణ వస్తే 11 రోజులు ఉపవాసం ఉన్న పవన్ ఇప్పుడు తెలంగాణ గురించి ప్రేమగా మాట్లాడుతున్నారు. మోదీ జాతీయ వాదం ముసుగులో ఆర్ధిక ప్రాంతీయ వాదం చేయడం లేదా?. ప్రధాన మంత్రి మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా?. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు కదం తొక్కిన నేల తెలంగాణ. ప్రాంతీయవాదం అంటున్న పవన్.. మరి మద్రాసు నుంచి వేరుపడటం కోసం పొట్టి శ్రీరాములు చేసింది ఏంటి?.
దేశభక్తి గురించి పవన్ మాకు చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ సోదరుడిగా వస్తే ఇంటికి పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెడతా. కానీ సెక్రటేరియట్లో కూర్చుని పెత్తనం చేస్తామంటే ఒప్పుకోము. పవన్ సినిమా పేరు ఓజీ.. కానీ తెలంగాణ ఓజీ కేసీఆర్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం అవుతుంటే మేము దానికి వ్యతిరేకంగా మాట్లాడాము అని గుర్తు చేశారు.


