ఉద్యమకారులను విస్మరించిన బీఆర్‌ఎస్‌  | BRS ignored the activists | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులను విస్మరించిన బీఆర్‌ఎస్‌ 

Feb 26 2024 4:54 AM | Updated on Feb 26 2024 4:54 AM

BRS ignored the activists - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమకారులను విస్మరించడం వల్లనే కాంగ్రెస్‌లో పార్టీలోకి  వలస వస్తున్నారని హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆదివారం గాందీభవన్‌లో  తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపా దాస్‌ మున్షి సమక్షంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత, బీఆర్‌ఎస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర చైర్మన్‌ శోభన్‌ రెడ్డి దంపతులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీపా దాస్‌ మున్షి వారిని కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో ఉద్యమకారులకు తగిన గుర్తిపు ఉంటుందన్నారు.

టీఆర్‌ఎస్‌ అమరుల త్యాగాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమకారులను తొక్కిపెట్టిందని గుర్తు చేశారు. ఉద్యమకారులు  పార్టీ వీడి మంచి నిర్ణయం తీసుకుంటున్నారని అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడిందని,  రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలందరిని సంక్షేమ అభివద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదని ఆరోపించారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరడం అత్తగారింటి నుండి తల్లి గారి ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. మోతే శోభన్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టడంతోనే రాజీనామా చేయడం జరిగిందన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉద్యమకారులను కాదని ధనబలం ఉన్న వ్యక్తులనే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉద్యమకారుల విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల విశ్వాసంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నామన్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్‌ కుమార్‌ యాదవ్, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, జీహెచ్‌ఎంíసీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ దర్పల్లి రాజశేఖర్‌ రెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి, కార్పొరేటర్లు  బాబా ఫసియొద్దీన్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement