సాక్షి జగిత్యాల: భీమారం మండలం మోత్కూరావుపేట శివారులో పెద్దపులి సంచరిస్తుందనే సమాచారంతో తీవ్ర కలకలం రేగింది. బండగుట్ట మైసమ్మ గుడి ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు అక్కడి రైతులు తెలిపారు. వ్యవసాయ పనులకు వెళుతుండగా కొంతమంది రైతులకు పెద్దపులి కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
పులి వివరాలు తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని దాని పాదముద్రికలను గుర్తించారు. మోత్కూరావు పేట-చందుర్తి తొర్ర ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టు ధృవీకరించారు. దీంతో స్థానికులను అప్రమత్తం చేశారు. కాగా రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా పులి సంచారం కలకలం రేపుతుంది. గతంలో సిద్ధిపేట–యాదాద్రి–జనగాం సరిహద్దుల్లో పెద్దపులి సంచరించింది. అయితే ఈ బెబ్బులి.. మహారాష్ట్ర అడవుల నుంచి రాష్ట్రంలోనికి ప్రవేశించినట్లు అధికారులు భావించారు.
పులి సంచారం జగదేవ్ పూర్ మండలంలో జరిగినట్టు ఆనవాళ్లు గుర్తించారు...అంతలోనే అది అక్కడి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో మకాం మార్చింది. రాజపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, ఆలేరు, గుండాల మండలాల్లో సంచరించింది. దానితో పాటు అమ్మనబోలు - అనంతారం గ్రామాల మధ్య ఓ వాగులో స్థానికులకు కంటపడినట్లు తెలిపారు.
అయితే ఇప్పుడు మరోసారి పులి జగిత్యాలలో కంటబడడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పులి అదేనా కాదా అనేది గుర్తించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు భద్రతకు సంబంధించిన కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.


