
సాక్షి,హైదరాబాద్: రోజుల వ్యవధిలో మరోసారి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. ‘మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం. ఆపరేషన్ కగార్ ఆపండి. లేదంటే నీ ప్రాణాలు తీస్తాం. ఇప్పటికే మా టీంలు హైదరాబాద్లో ఉన్నాయి. దమ్ముంటే కాపాడుకో’ అంటూ అగంతకులు రెండు నెంబర్ల నుంచి రఘనందన్ బెదిరింపులకు దిగారు. దీంతో అప్రమత్తమైన రఘునందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గత వారం బెదిరింపు కాల్
గత వారం ఎంపీ రఘునందన్కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ‘ఈరోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతాం అని ఫోన్లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్ నుంచి అగంతకుడు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ కాల్ వచ్చే సమయంలో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో రఘునందన్ పాల్గొన్నారు.

బెదిరింపు కాల్తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘునందన్ ఫిర్యాదుతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.