
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ కా ర్యాలయాల్లో ఇకపై కేవలం బీఆర్ అంబేద్కర్, భగత్సింగ్ ఫొటోలు మాత్రమే ఉంచాలని, మరే నాయకుడి ఫొటో ఉంచకూడదని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. ప్రభుత్వాఫీసుల్లో కనీసం ముఖ్యమంత్రి ఫొటో కూడా ఉంచాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, స్వాతంత్య యోధుడు భగత్ సింగ్ను ఆయన కొనియాడారు. వీరిరువురి ఆలోచనాధోరణికి అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రిపబ్లిక్డే ప్రసంగంలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
దేశంలో ప్రతి చిన్నారికి సరైన విద్య అందాలన్నది అంబేద్కర్ ఆశయమని గుర్తు చేశారు. ఇందుకోసం విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను ఆయన వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకు ఢిల్లీ టీచర్స్ యూనివర్సిటీ ఏర్పా టు చేస్తామన్నారు. విజయానికి కులమతాలతో పనిలేదని అంబేద్కర్, భగత్సింగ్ భావించారని కేజ్రీవాల్ చెప్పారు. తమ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన మార్పులను ఆయన వివరించారు.