సాక్షి,బెంగళూరు: తమిళనాడులో బీజేపీకి మరో బిగ్షాక్ తగిలింది. తమిళనాడులో బీజేపీకి మరో బిగ్షాక్ తగిలింది. తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజీనామా చేసిన తర్వాత, ఆయన బాటలో మరికొందరు నేతలు కూడా పార్టీని వీడారు. ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్, రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్ సహా కనీసం 15 మంది కీలక పదవుల్లో ఉన్న నాయకులు రాజీనామా చేశారు.
కరు నాగరాజన్ 2016లో మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2017లో ఆర్కే నగర్ ఉపఎన్నికలో పోటీ చేశారు. అయితే రెండు సార్లూ ఘోర పరాజయం పాలయ్యారు. ముఖ్యంగా 2017 ఉపఎన్నికలో ఆయనకు వచ్చిన ఓట్లు నోటా కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఆ ఎన్నికలో ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ విజయం సాధించారు.
ఇక బీజేపీకి రాజీనామా, రాజీనామాకు బీజేపీ పెద్దలు ఆమోదం తెలపడంపై అన్నామలై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రాష్ట్రంలో తాను కొత్త ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అన్నామలై మక్కల్ ఇయ్యక్కం (AMI) పేరుతో ప్రారంభమైన ఈ ఉద్యమం 2031 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. కల్ట్ పొలిటిక్స్ నుంచి బయటపడుతూ, సాధారణ ప్రజల రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నామలై స్పష్టం చేశారు.
పార్టీ నిర్ణయాలపై అసంతృప్తి
అన్నామలై ఈ వారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్లతో సమావేశమయ్యారు. తన రాజీనామా లేఖలో, తమిళనాడు రాజకీయ వ్యూహంపై పార్టీ నాయకత్వంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.
అన్నామలై రాజకీయ ప్రయాణం కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి వీద ఫౌండర్ లీడర్స్ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించారు. 2020లో బీజేపీలో చేరి, ఏడాదిలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై ఆయన చేసిన దూకుడు ప్రచారాలు, పాదయాత్రలు బీజేపీకి తమిళనాడులో గుర్తింపు తెచ్చాయి. అయితే 2026 ఎన్నికల్లో బీజేపీ–ఏఐఏడీఎంకే కూటమి నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కావడంతో చివరికి ఆయన పార్టీని వీడారు.


