సాక్షి, తాడేపల్లి: పొన్నూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీలోకి వంద టీడీపీ కుటుంబాలు చేరాయి. పొన్నూరు ఇంఛార్జి అంబటి మురళీ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందన్నారు.
రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని.. దేశంలో ఎక్కడాలేని అరాచకం, హింసాకాండ ఏపీలో జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘‘సమర్ధత కలిగిన పోలీసు అధికారులను పక్కన పెట్టారు. తమకు అనుకూలమైన పోలీసులతో ప్రత్యర్ధులను వేధిస్తున్నారు. అక్రమ కేసులు నిత్యకృత్యంగా మారాయి. అత్యంత దారుణమైన పాలనను ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపాలి. ప్రజల కోసం ప్రతి కార్యకర్త పని చేయాలి..
..పొన్నూరులో చట్టమే రౌడీయిజానికి పాల్పడుతోంది. పొన్నూరు ఎమ్మెల్యే అరాచకాలను జనం చూస్తున్నారు. మామిళ్లపల్లి ఘటనలో పోలీసుల తీరు జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయింది. అంబటి మురళి ఆధ్వర్యంలో గట్టిగా నిలబడిన పార్టీ కేడర్కి అభినందనలు. రానున్న రోజుల్లో మరింత గట్టిగా పోరాటం చేయాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.


