జ్యోతినగర్: రామగుండం రెవెన్యూ కార్యాల యంలో ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రభుత్వం అందుబాటు లోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్(ఎఫ్ఆర్సీ) కోసం మీ సేవ కేంద్రాల ద్వారా దరఖా స్తు చేసుకున్నవారు నెలరోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఒక్కరికీ కూడా ఎఫ్ఆర్ సీ సర్టిఫికెట్ అందలేదు. సుమారు 400 వరకు కు లం, ఆదాయం, నివాసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు దరఖాస్తుదారులు చెబుతున్నారు.
ఇతర మండలాల్లో జారీ
పెద్దపల్లి, కాటారం, అంతర్గాం, కరీంనగర్ మండలాల్లో మీ సేవ ద్వారా దరఖాస్తు దారులకు ఎఫ్ఆర్సీ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. రామగుండంలో పెండింగ్లో ఉంటున్నాయి.
సంక్షేమ పథకాలకు ఆటంకం
సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందకపోవడం సమస్యగా మారిందని ప్రజలు చెబుతున్నారు. చేయూత పథకానికి ఆదాయ ధ్రువీకరణ, ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం. వీటికోసం దరఖాస్తు చేసుకునే వారు రెవెన్యూ కార్యాలయంపై ఆధారపడాల్సి వస్తోంది.
ఎస్ఐఆర్తో మరింత ఇబ్బంది
ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాల పరిశీలన, ధ్రువీకరణ వంటి పనుల్లో రెవెన్యూ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో సాధారణ రెవెన్యూ సేవలు ఆలస్యమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న కొందరు ఓటర్లకు కూడా కులం, నివాసం ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతున్నాయని పేర్కొంటున్నారు.
లాగిన్లోనే నిలిచిపోతున్న దరఖాస్తులు?
కులం, నివాసం, ఆదాయం దరఖాస్తులు అధికారులు పరిశీలించి లాగిన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. తద్వారా తహసీల్దార్స్థాయిలో ధ్రువీకరణ పూర్తిచేసి మీ సేవ కేంద్రాల ద్వారా సర్టిఫికెట్లు అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సర్టిఫికెట్ల జారీలో తీవ్రజాప్యం
ఎఫ్ఆర్సీ కోసం నెల రోజులుగా తప్పని ఎదురుచూపులు


