పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి షాపింగ్ కాంప్లెక్స్ను కూల్చేవేస్తారా? లేక ఖాళీ చేయిస్తారా? అనేదానిపై స్పష్టత రాక కిరాయదారుల్లో ఆందోళన నెలకొంది. కొద్దిరోజుల క్రితం ఎవరికీ చెప్పాపెట్టకుండా షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట కందకాలు తవ్వి రాకపోకలు నిలిపివేశారు. దీంతో వ్యాపారం సాగడం లేదనే కొందరు వ్యాపారులు దుకాణాలు ఖాళీ చేశారు. ఇంకొందరు అనువైన గదులు దొరక్క కాలం వెళ్లదీస్తున్నామని, అధికారులు గోతి తవ్వి వదిలేయడంతో వ్యాపారం సాగడం లేదని పేర్కొంటున్నారు. పాతికేళ్లపాటు లీజు ఒప్పందంపై పొందిన వ్యక్తి నామమాత్రపు అద్దెచెల్లిస్తూ ఇతరులకు అద్దెకు ఇస్తూ ఎక్కువ వసూలు చేసుకుంటున్నట్టు గుర్తించిన అధికారులు.. ప్రభుత్వ ఆస్పత్రికి ఆదాయం పెంచాలనే లక్ష్యంతోనే ఈ చర్య తీసుకుంటున్నట్టు కొందరు పేర్కొంటున్నారు. ఆస్పత్రికి రోజూ వెయ్యిమందికిపైగా రోగులు ఓపీ కోసం వస్తున్నారని, వారుకాకుండా ఇన్పేషెంట్లుగా ఉన్నవారి బంధుమిత్రులు రాకపోకలు సాగిస్తుండడంతో వాహనాలు పార్కింగ్ చేయడం సమస్యగా మారిందంటు న్నారు. షాపింగ్ కాంప్లెక్స్ను కూల్చివేసి ప్రహరీ నిర్మిస్తే ఆస్పత్రి లోపన వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేస్తారని మరికొందరంటున్నారు. కానీ మున్సిపల్ అధికారులు తమకేమీ తెలియదని, ఉన్నతాధికారుల సూచనల మేరకే కందకాలు తవ్వించినట్లు సెలవిస్తున్నారు. భవిష్యత్లో ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.
షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారంపై కిరాయిదారుల ఆందోళన
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట కందకాలు తవ్వించిన వైనం


