పెద్దపల్లి: జిల్లాలో ఆదివారం నిర్వహించే నీట్ పీజీ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం డీసీపీ రాంరెడ్డితో కలిసి పెద్దపల్లి మండలం పెద్దకల్వలలోని మదర్థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల, పెద్దపల్లిలోని బండారికుంట సమీపంలో ట్రినిటీ ఇంజిజనీరింగ్ కళాశాల, రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్టీయూ కళాశాలలో పరీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 30న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్థులను ఉదయం 7.30 నుంచి 8.45 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డు, ప్రొవిజనల్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్, జిరాక్స్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. అడ్మిట్కార్డును ఏ4 పేపర్పై కలర్లో బ్యాక్ టు బ్యాక్ ప్రింట్ చేసుకోవాలన్నారు. కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, హెల్త్ అసిస్టెంట్లను ఏర్పాటు చేసి అవసరమైన వైద్య సదుపాయం కల్పించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో సీసీటీవీ, మొబైల్ జామర్లు ఏర్పాటు చేసి, ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, గడియారాలు, ఆభరణాలు, షూస్ అనుమతించరని స్పష్టం చేశారు. పరీక్ష పర్యవేక్షణకు జిల్లాలో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని, పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగిరి తహసీల్దార్లు రాజయ్య, బషీరోద్దీన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
పొరపాట్లు లేకుండా సర్ ప్రక్రియ
సర్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శనివారం పెద్దపల్లి పట్టణం 2వ వార్డ్ శాంతినగర్లో సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా సర్ ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అందుబాటులో ఉన్న రికార్డులతో సరిపోల్చి నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, అభ్యంతరాలను స్వీకరించి, గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూ చించారు. ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు.
ఉదయం 7.30 నుంచి 8.45 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి
కలెక్టర్ కోయ శ్రీహర్ష


