మంథనిరూరల్: వేసవి ప్రారంభమైంది. ఈసారి గ్రామాల్లో తాగునీటి సమస్య నివారణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం గతనెల మొదటివారం నుంచి 20 రోజులపాటు క్షేత్రస్థాయిలో తాగునీటి పథకాల పనితీరుపై సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టింది. ఎక్కడ కూడా తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పంచాయతీలకు కేటాయించే ఆర్థిక సంఘం నిధుల్లోంచి ఈసారి నీటిపథకాల మరమ్మతు చేపట్టనున్నారు.
క్షేత్రస్థాయిలో సర్వే
జిల్లాలోని 257 గ్రామాల్లో అధికారులు తాగునీటి సమస్య నివారణకు క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. ప్రతీగ్రామంలో ఎన్నిసాగునీటి పథకాలు ఉన్నాయి, అందులో ఎన్ని పనిచేస్తున్నాయి, ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా, విద్యుత్ మోటార్ల పరిస్థితి ఎలా ఉంది? అనేదానిపైనా పరిశీలన చేశారు. ఇరవై రోజుల పాటు అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రతీ పథకాన్ని పరిశీలించి సమగ్ర నివేదిక తయారు చేశారు.
జిల్లాలో నీటి వనరులు ఇవే..
జిల్లావ్యాప్తంగా 3,358 చేతిపంపులు, 535 సింగిల్ఫేజ్, 595 త్రీఫేజ్ విద్యుత్ మోటార్లతో నడిచే పథకాలు, 247 బావులు ఉన్నాయి. అయితే ఇటీవ ల అధికారులు క్షేత్రస్థాయిలో నీటిపథకాలను పరి శీలించగా.. 641 చేతిపంపులు, 49 సింగిల్ఫేజ్, 63 త్రీఫేజ్, 22 బావులు పనిచేయడం లేదని తేలింది. వీటికి మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.
క్షేత్రస్థాయిలో మండల అధికారులు
జిల్లాలోని ఆయా గ్రామాల్లో మండలస్థాయి అధికారులు తాగునీటి పథకాలను పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇందులో ఎంపీడీవో, ఎంపీవో, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, గ్రిడ్ ఏఈలతోపాటు స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి బృందంగా ఏర్పడ్డారు. ఏగ్రామంలోనూ నీటిసమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
సమస్య పరిష్కారమయ్యేలా..
పల్లెల్లో ముందస్తు నీటి పథకాల సర్వే
వేసవికి ముందే నివారణ చర్యలకు కసరత్తు
పనిచేయని జలవనరులకు మరమ్మతు
నీటిసమస్య రాకుండా చర్యలు
వేసవిలో ఎక్కడా నీటిసమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో నీటి వనరులు పరిశీలించాం. వాటి స్థితిగతుల ఆధారంగా మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకువస్తాం.
– దాసరి రాజ్కుమార్,
డీఈ, ఆర్డబ్ల్యూఎస్, మంథని


