టీడీపీ పాలనలో
● స్థానిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధం కావాలి
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
పాచిపెంట: టీడీపీ పాలనలో ప్రజా సంక్షేమానికి గ్రహణం పట్టిందని మాజీ డిప్యూటీ సీఎం, సాలూరు మాజీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. పాచిపెంట మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో పార్టీ మండలాధ్యక్షుడు గొట్టాపు ముత్యాలనాయుడు, పార్టీ సమన్వయకర్త పాచిపెంట వీరంనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పాచిపెంట మండలం వైఎస్సార్సీపీకి కంచుకోటగా పేర్కొన్నారు. స్థానిక సమరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజేతలుగా నిలపాలని కోరారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. రెండున్నరేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయలేని దుస్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పింఛన్ల మంజూరు పేరుతో టీడీపీ కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. ఇటీవల టీడీపీలో చేరిన జిల్లాకు చెందిన ఓ నాయకుడిపై గతంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా? అని ప్రశ్నించారు. అనంతరం పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులకు ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ బి.ప్రమీల, వైస్ ఎంపీపీ మీసాల నారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సలాది అనూరాధ, పార్టీ నాయకులు శనపతి నారాయణరావు, కలువలపల్లి పెద్దిబాబు, బోను ధనుంజయ్, సలాది అప్పలనాయుడు, చింత సీతయ్య, కిర్ల రామకోటేశ్వరరావు, సోముల లచ్చయ్య, మాదల సింహాచలం, డోనేరు లచ్చయ్య, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


