వినతులు అందజేయొద్దు.. | - | Sakshi
Sakshi News home page

వినతులు అందజేయొద్దు..

Aug 23 2026 12:34 AM | Updated on Aug 23 2026 12:34 AM

● ప్రశ్నించొద్దు..

విజయనగరం అర్బన్‌:

విజయనగరంలో శనివారం రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారా లోకేశ్‌ పర్యటన అడుగడుగునా ఆంక్షల నడుమ సాగింది. వినతులు అందజేసేందుకు, గోడు వినిపించేందుకు వచ్చిన నిరుద్యోగులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, చిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. వినతులు అందజేసేందుకు అవకాశం కల్పించలేదు. లోకేశ్‌ వెళ్లే మార్గంలో వినతులు పట్టుకుని కొందరు, ప్లకార్డులు పట్టుకుని మరికొందరు తమ సమస్యలు తెలియజేసే ప్రయత్నం చేసినా... ఆయన వారివైపు కన్నెత్తి చూడలేదు. దాసన్నపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు జరిగిన ఉపాధ్యాయుల క్లస్టర్‌ సమావేశంలో ఆద్యంతం తన ‘సొంత ప్రచారం’ చేసుకోవడానికే లోకేశ్‌ ప్రాధాన్యం ఇవ్వడంపై ఉపాధ్యాయ వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి.

పొగడ్తలకే పరిమితమైన సమీక్ష

పాఠశాలలోని లైబ్రరీ, సైన్స్‌ ల్యాబ్‌లను లోకేశ్‌ సందర్శించారు. అనంతరం సబ్జెక్ట్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలను పరిశీలించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌ గది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 క్లస్టర్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాల టీచర్లతో ముఖాముఖి నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన జెడ్పీ ఉన్నతపాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ టీచర్లు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ కలిపి మొత్తం 9 మంది నుంచి అభిప్రాయాలను మంత్రి విన్నారు. అయితే పాఠశాలల అభివృద్ధికి గానీ, బోధనా వ్యవస్థ మెరుగుదలకు గానీ ఉపయోగిపడే ఒక్క సూచన కూడా వాళ్ల నుంచి రాలేదు. కేవలం మంత్రిని, శాఖ నిర్వహణను ఆకాశానికెత్తుతూ పొగడడానికే సమయం కేటాయించారు. అసలు విద్యాశాఖ పనితీరును సమీక్షించడానికి వచ్చారా లేదా తనను తాను పొగిడించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారా అన్న చందంగా క్లస్టర్‌ సమావేశం సాగింది.

విద్యాశాఖ ఫలితాలపై సీఎం సంతృప్తిగా లేరు

విజయనగరం రూరల్‌: రాష్ట్రంలో విద్యాశాఖ సాధించిన ఫలితాలపై ముఖ్యమంత్రి సంతృప్తిగా లేరని, నూరుశాతం ఫలితాలపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సూచించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని దాసన్నపేట జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశానికి లోకేశ్‌ శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలు పూర్తయ్యాయని, ఇకపై పూర్తిగా అభ్యసనా ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టి సారించాలన్నారు. విశాఖలో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయిని చిన్నారిపై చేయి చేసుకోవడంతో చిన్నారి చనిపోయిన బాధాకరమైన ఘటన తనను కలచివేచిందని, పిల్లలను కంటిరెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కాలం మారిందని, విద్యార్థులు ప్రశ్నించే రోజులు వచ్చాయన్నారు. నైతిక విలువల పెంపు, తల్లిదండ్రులను, మహిళలను గౌరవించడంపై విద్యార్థులకు చిన్నతనం నుంచే శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ ఏడాది మరో మూడు వేల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. మంత్రి జిల్లా పర్యటనలో జూనియర్‌ డాక్టర్లు తమ సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

టీటీపీ కార్యకర్తల హడావిడి

మంత్రి లోకేశ్‌కు ముందుగా మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, ఇన్‌చార్జి మంత్రి అనిత, ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, ఎంపీ అప్పలనాయుడు స్వాగతం పలికారు. సాయంత్రం చెల్లూరు వద్ద నిర్వహించిన విజయనగరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో లోకేశ్‌ పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.

అడుగడుగునా ఆంక్షల నడుమ నారాలోకేశ్‌ పర్యటన

నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకున్న పోలీసులు

వినతులు అందజేసేందుకు

ససేమిరా

నిరుద్యోగులు, విద్యార్థుల వైపు

కన్నెత్తి చూడని లోకేశ్‌

ప్లకార్డులు ప్రదర్శించినా

కనికరించని వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement