పార్వతీపురం: ప్రభుత్వాస్పత్రులకు వచ్చే పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఆస్పత్రుల రూపురేఖలు మార్చాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వైద్యాధికారులు, ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ను శనివారం నిర్వహించారు. ఆస్పత్రులో పరిశుభ్రత, ఆహ్లదకర వాతావరణం కల్పించాలని, రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. మౌలిక వసతుల సమస్యలను ఇ–ఆఫీస్ ద్వారా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. పెండింగ్లో వున్న ఆస్పత్రి నిర్మాణ పనులను ఈ నెలఖారులోగా పూర్తి చేయాలని, పనుల పురోగతిని సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలని తెలిపారు. సోమవారం ఆస్పత్రిని స్వయంగా పరిశీలించడంతో పాటు వర్చువల్ ఇన్స్ఫెక్షన్లు నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ జి.నాగభూషణరావు తదితరులున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు
అధికారుల సంసిద్ధత
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో అధికారులు పూర్తి సంసిద్ధతతో ఉండాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లుపై అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన ఆయన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లును సమీక్షించారు. సమీక్షలో డీఆర్ఓ కె.హేమలత, డీపీఓ ఎస్.రవీంద్ర, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల జెడ్పీ సీఈఓలు ఆర్.వెంకట్రామన్, లోవరాజు తదితరులున్నారు.
వసతిగృహల్లో
పరిశుభ్రతకు ప్రాధాన్యం
సంక్షేమ వసతిగృహలు, గురుకుల విద్యాలయాల్లో పారిశుధ్యం, విద్యార్థుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వసతిగృహలలో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతోపాటు కిచెన్, వంట పాత్రలు, మరుగుదొడ్లును నిరంతరం శుభ్రంగా ఉంచాలని సూచించారు. వర్చువల్ తనిఖీలలో పరిశుభ్రతను పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీఓ మురళీధర్, తదితరులున్నారు.
నెలాఖరులోగా తాగునీరు,
మరుగుదొడ్ల వసతులు పూర్తి
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతిగృహలు, గురుకులాలు, ప్రభుత్వ కార్యాలయాలలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను ఈ నెలఖారులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 229 అంగన్వాడీ కేంద్రాల్లో 89 కేంద్రాలకు తాగునీటి సౌకర్యం లేదని గుర్తించినట్లు తెలిపారు. ఆయా కేంద్రాలలో నీటి వసతులను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. సమీక్షలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, డీఈఓ పి.బ్రహ్మజీరావు తదితరులున్నారు.


