● జీవితకాల జీవనభృతినిస్తూ ప్రభుత్వ జీఓ జారీ
విజయనగరం టౌన్: మహాకవి గురజాడ అప్పారావు స్వగృహాన్ని పరిరక్షించడంలో, వారి వారసత్వాన్ని కొనసాగించడంలో గతేడాదిగా గురజాడ వారసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి విదితమే. అవుట్సోర్సింగ్లో ఇచ్చిన ఉద్యోగాన్ని కూడా చెప్పాపెట్టకుండా తొలగించిన కూటమి ప్రభుత్వానికి సాహితీవేత్తలు ఉత్తరప్రత్యుత్తరాలు చేస్తూ పలుమార్లు నివేదన చేశారు. ఈ నేపథ్యంలో జూలై 20న సాక్షిలో ‘ఆయన కడుపు కొట్టారు’ శీర్షికతో కథనం వెలువడింది. దీనిపై ప్రభుత్వం స్పందించి కేవలం నెలరోజుల వ్యవధిలోనే పూర్తిస్ధాయిలో న్యాయం చేకూరేలా జీవితకాల జీవనభృతిని నెలకు రూ.30వేలు కేటాయిస్తూ జీఓ జారీచేసింది. ఈ మేరకు మహాకవి స్వగృహంలో గురజాడ మునిమనుమడు గురజాడ వెంకటేశ్వరప్రసాద్, ఇందిర దంపతులు మంగళవారం మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహనీయుల జ్ఞాపకాలను కాపాడుకుంటూ వస్తున్న వారికి, వారి కుటుంబీకులకు జీవితకాల భృతినివ్వడం విషయంలో ఆలస్యంగానైనా స్పందించి ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.


