చిత్రంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చేతుల మీదుగా ఇటీవల సీఎం రిలీఫ్ ఫండ్ అందుకుంటున్నది బలిజిపేట మండలం వంతరాం గ్రామానికి చెందిన మండ జగ్గారావు. ఈయనకు గ్రామంలో 5 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఒక పిండిమిల్లు, పక్కా నివాసగృహం ఉంది. ధాన్యం, జొన్న గింజల వ్యాపారం చేస్తారు. ఈయన తన వ్యాపారాలతో పాటు రోజువారీ పనులు యథావిధిగా చేసుకుంటున్నారు. అయితే, ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.64,435లు అందింది. పేదరికంలో కొట్టుమిట్టాడుతూ... వివిధ వ్యాధులతో సతమతమయ్యేవారికి అందే సీఎం సహాయనిధి ఆయనకు ఎలా అందిందన్న చర్చ పార్వతీపురం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.


