బతుకు బండికి..
ఈ చిత్రంలోని మహిళ పేరు కొనుసు లక్ష్మి, పార్వతీపురం. ఆమెకు ఇద్దరు మగ పిల్లలు. ఒక అబ్బాయి బీటెక్ రెండో ఏడాది, మరో అబ్బాయి సీఏ చదువుతున్నారు. పిల్లల పెద్ద చదువుల కోసం అధిక మొత్తంలో అప్పులు చేయాల్సి వస్తోందని.. చాలా వరకు బంగారం తాకట్టు పెట్టి, ఫీజులు కట్టాల్సి వస్తోందని ఆమె అంటున్నారు. ప్రస్తుతం పేద, మధ్య తరగతి కుటుంబాల్లో అప్పులు చేయకుండా ఏ ఒక్కరూ ఉండడం లేదని చెబుతున్నారు.
ఈమె పేరు అలమండ రమ. పార్వతీపురంలోని దేవాంగులవీధికి చెందిన ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఎన్నో కష్టాలకోర్చి ముగ్గురినీ డిగ్రీ వరకూ చదివించారు. వీరిలో ఒకమ్మాయి ఇప్పుడు బీటెక్ చదువుతోంది. ‘ఫీజుల కోసం వడ్డీలకు అప్పులు తెచ్చి కడుతున్నాం. చేసిన అప్పులు తీర్చడమే పెద్ద భారమయ్యేటట్లు ఉంది. ప్రభుత్వపరంగా రీయింబర్స్మెంట్ అందితే కొంత మేర అయినా ప్రయోజనం ఉండేద’ని ఆమె అంటున్నారు.
భామిని మండలం గురండి సెంటర్లో ఫాన్సీ దుకాణం నడుపుతున్న ఈయన పేరు గెల్లంకి రాంబాబు. లోహరిజోల ప్రాంతానికి చెందిన రాంబాబు.. నాలుగేళ్లుగా ఈ వ్యాపారంపైనే ఆధారపడుతున్నాడు. రెండేళ్లుగా వ్యాపారం అంతంతమాత్రంగానే ఉంటోందని.. కుటుంబ జీవనాధారం ఇదే కావడంతో, అప్పులు చేసి సరకులు తీసుకొస్తున్నానని చెబుతున్నాడు. వచ్చిన లాభాల కంటే.. చేసిన అప్పు, వడ్డీలకే మొత్తం సరిపోతోందని వాపోతున్నాడు.


