ఎల్నినో ప్రభావం ఉందని తెలిసినా నదిలోకి వృథాగా నీరు
నేడు వీఆర్ఎస్ ద్వారా నీటి విడుదల
మక్కువ:
ఎల్నినో ప్రభావంతో ఈఏడాది రైతులు పంటల సాగు విషయంలో ఇబ్బందులు పడే ఆస్కారముందని ఇరిగేషన్ అధికారులకు ముందుగానే సమచారం ఉంది. వర్షాలు కురవక, వీఆర్ఎస్ ప్రాజెక్ట్లో నీరుచేరని విషయం తెలుసు. ఈ ఏడాది పంటల సాగువిషయంపై నారుమడులు తయారుచేయకముందు, ఇరిగేషన్ అధికారులు గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించుంటే, ప్రత్యామ్నాయం చూసుకునేవాళ్లమని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు వెచ్చించి, నారమడులను రైతులు తయారుచేశారు. వాటిని కాపాడుకునేందుకు మోటార్లు, ట్యాంకర్లు, బిందెలతో నీటిని తీసుకెళ్లి తడుపుకుంటూ కాపాడుకున్నారు. మరమ్మతులకు గురైన స్పిల్వే ద్వారా లీకేజీనీటిని, ఇరిగేషన్ అధికారులు అరికట్టకుండా, పనుల పేరిట కాలువ మధ్యలో ట్రెంచ్లు కొట్టి నదులోకి వదిలేశారు. కేవలం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఏడాది సాగునీటికోసం అనేక అవస్థలు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
156 మీటర్ల నీటి నిల్వ
ఇదిలా ఉండగా వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ ద్వారా కాలువలకు సాగునీటిని శుక్రవారం ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. వీఆర్ఎస్(ఎఫ్ఆర్ఎల్) పూర్తిస్థాయి రిజర్వాయర్ లెవెల్ 161.00మీటర్లు కాగా, ప్రస్తుతం 156.00మీటర్ల నీటి నిల్వ ఉంది. అంటే ప్రాజెక్ట్లో నీటినిల్వ కేవలం 35శాతం మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు. కాలువల ద్వారా నీటిని పూర్తిస్థాయిలో విడిచిపెడితే, ప్రస్తుతమున్న నీరు కేవలం 15రోజులు మాత్రమే సరఫరా అవుతుంది. ఈ విషయం ఇరిగేషన్ అధికారులకు తెలిసినప్పటికి, చేసిందంతా చేసి, ఇప్పుడు మెప్పుకోసం నీరు విడుదలకు సిద్ధమయ్యారని రైతులు విమర్శిస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోయి, ప్రాజెక్ట్ నిండకపోతే సాగుచేసిన పంటలు నష్టపోతే ఆనష్టాన్ని ఎవరు భరిస్తారో చెప్పాలంటూ పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంపై ఇరిగేషన్ డీఈఈ సురేష్ను వివరణ కోరగా నారుమడులు బతికిద్దామనే ఆలోచనతో నీరు విడుదలకు సిద్ధమయ్యామన్నారు. 15ఎల్, బొబ్బిలి టెయిలెండ్ వరకు కాలువల పనులు జరిపించడంతో, మధ్యలో ట్రెంచ్కొట్టి లీకేజీనీటిని నదిలోకి విడిచిపెట్టామన్నారు. నీరువిడుదల అంశంపై గురువారం నీటిసంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి, నీటివిడుదల నిర్ణయం తీసుకున్నామని వివరించారు.


