● ఆందోళనలో రైతన్నలు
గరుగుబిల్లి: జంఝావతి కాలువ ద్వారా శివారు భూములకు సాగునీరు అందకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జంఝావతి ప్రాజెక్టు ద్వారా పార్వతీపురం, కొమరాడ, సీతానగరం, గరుగుబిల్లి, మక్కువ మండలాల్లోని సుమారు 24వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో గరుగుబిల్లి మండలంలోని జంఝావతి హైలెవెల్ కాలువ ద్వారా 5వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయడంతో గరుగుబిల్లి మండలంలోని మొదటి గ్రామమైన సీతారాంపురం వరకు మాత్రమే సాగునీరు సరఫరా అవుతోంది. మిగిలిన గ్రామాలైన ఉల్లిభద్ర, గొల్లవానివలస, గొట్టివలస, గరుగుబిల్లి, పెద్దూరులకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. దీంతో తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇప్పటికే వరినారుమళ్లను సిద్ధం చేయడంతోపాటు వివిధ గ్రామాల్లో వేసిన వరి వెదలు కూడా ఎండలకు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ ద్వారా సాగునీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు, పాలకులు ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రైతులు మండిపడుతున్నారు. కాలువ శివారు భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


