గిరిజన మంత్రి ఇలాకాలో..
విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే విద్యకు పెద్దపీట వేస్తామని సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించారు. గద్దె నెక్కినతర్వాత హామీలను గాలికి వదిలేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పాఠశాలకు భవనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మంత్రి నియోజకవర్గంలోని మెంటాడ మండలం రెడ్డి వానివలస గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో 1వతరగతి నుంచి 5వ తరగతి 28 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఈ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ప్రస్తుత మంత్రి సంధ్యారాణి రెడ్డివానివలస పాఠశాలకు సొంత భవనాలు నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇంతవరకు పునాది రాయి కూడా అక్కడ పడలేదు. ప్రస్తుతం పాఠశాల నిర్వహిస్తున్న భవనం వసతులు చాలకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడతున్నారు. ఈ పాఠశాలకు పక్కా భవనాలు నిర్మించాలని గతంలో కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


