
డీఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదల
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ శిక్షణ కోర్సులో ప్రవేశించేందుకు ఉద్దేశించిన డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ డీఈఈ సెట్–2025) నోటిఫికేషన్ విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పట్టణంలో ఉన్న డైట్ కళాశాలతో పాటు కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో కూడా ప్రవేశాలు పొందవచ్చు. జూన్ 2, 3 తేదీల్లో ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లింపులు
డీఈఈ సెట్–2025కు దరఖాస్తు చేసుకునేందుకు రూ.750 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 22 నుంచి మే 7వ తేదీ వరకు ఆసక్తి, అర్హత ఉన్న వారు ఆన్లైన్లో పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ లేదా ఏపీడీఈఈఈసెట్.ఏపీఈఎఫ్ఎస్ఎస్.ఇన్ ద్వారా ఈ నెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు.
ప్రవేశ పరీక్షకు అర్హతలివే...
దరఖాస్తుదారులకు ఈ ఏడాది సెప్టె ంబర్ ఒకటో తేదీ నాటికి 17 ఏళ్లు నిండి, భారత జాతీయుడై ఉండాలి. పదో తరగతితో పాటు, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్లో 50 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 45 శాతం మార్కుల అర్హత ఉండాలి. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణతకు ఓసీ, బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 25 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు చదివిన వారు ప్రవేశ పరీక్ష రాసేందుకు అనర్హులు.
మార్కుల కేటాయింపు ఇలా...
గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజిలక్ సైన్స్, సోషల్ స్టడీస్కు ఒక్కో బ్రాంచ్కు 25 శాతం వంతున సీట్లు కేటాయిస్తారు. 6 – 10వ తరగతుల వరకు ఉన్న సిలబస్పై ప్రశ్నపత్రం ఉంటుంది. 100 మార్కులకు ఆన్లైన్ తరహాలో 2.30 గంటల పాటు పరీక్ష ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. పార్ట్–ఏ 60 మార్కులు, పార్ట్–బీ 40 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. పార్ట్–ఏ లో టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్, తెలుగులో ఐదేసి మార్కుల వంతున, ఎంచుకున్న భాష, గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్కు సంబంధించి ఒక్కో సబ్జెక్టుకు 10 మార్కుల వంతున మొత్తం 60 ప్రశ్నలు వస్తాయి. పార్ట్–బీలో అభ్యర్థి ఎంచుకున్న ప్రధాన సబ్జెక్టు నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు వస్తాయి.
ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
మే 8వ తేదీ తుది గడువు
జూన్ 2, 3 తేదీల్లో పరీక్ష